చైన్నై: తమిళనాడులో ఎన్నికల వేళ మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నానని శశికళ ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించింది. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని శశికళ తెలిపింది. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంది.
అయితే ఈ రోజు ఉధయం (మంగళవారం) దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శశికళ.. త్వరలోనే ఒక శుభవార్త వింటారని బహిరంగంగా ప్రకటించారు. దీంతో రేపోమాపో శశికళ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ, కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు సర్వత్రా వినిపించాయి. ఇంతలోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
కాగా శశికళ ,జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇదివరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.


