సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ పేరులో తెలంగాణ ఉండేలా చూసుకొని మే మొదటి వారంలో మంచి ముహూర్తంలో పార్టీని ఏర్పాటు చేస్తాం. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ప్రజల కోసం పార్టీని నడుపుతాం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మేమే. ప్రజల సమస్యలను బలంగా లేవనెత్తుతున్నాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణలో బీజేపీ క్రమంగా కనుమరుగవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి మా పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉంది. మా పార్టీ గుర్తుపైనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం’అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
గురువారం జాగృతి కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లీడర్లు చాలామంది టచ్లో ఉన్నారని, తెలంగాణనే తమ పార్టీ మదర్ బోర్డ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బోధన్, సిద్దిపేట సహా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పార్టీ పెడతానని బీజేపీలో చేరి.. ఇప్పుడు మరో పార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మీకుల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్న రేవంత్రెడ్డి.. కార్మీకుల గుండెలకు గాయాలవుతున్నా కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీని క్రమంగా నిరీ్వర్యం చేసే కుట్ర చేస్తున్నారని, ఆర్టీసీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ గతంలో ఎర్రవల్లికి వెళితే.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోందని కవిత ఎద్దేవాచేశారు.


