లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ముంబై: లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాల్లో ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపించాలనే అభిప్రాయంతో పార్టీల కార్యకర్తలు కూడా ప్రచార జోరును పెంచారు.
అయితే అభ్యర్థిగానీ, ఆయన మద్దతుదారులుగానీ పోలింగ్ రోజున అప్రమత్తంగా లేకపోతే ఇన్నిరోజుల శ్రమ అంతా వృథా అవుతుంది. ఒకవేళ గెలిచే అకాశమున్నా కార్యకర్తలు చేసే చిన్న చిన్న పోరపాట్లు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే ఆస్కారముంది. అందుకే పోలింగ్ రోజున అభ్యర్థులు, కార్యకర్తలు ఎలా మెలగాలి? ఏం చేస్తే తప్పుల్లో చిక్కుకుంటారనే విషయంలో అవగాహనను కలిగి ఉండాలి. ఆయా విషయాలపై కథనం...
పోలింగ్ స్టేషన్లో..
పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ పీవోలు, సిబ్బంది అయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని లోపలికి రానివ్వరు. ఓటు వేయడానికి వచ్చిన వారికి అనుమతి ఉంటుంది. ఐదుగురు చొప్పున పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. పోలింగ్ సమయం ముగిసే సరికి పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉంటే వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.
గొడవ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎంతో సహనం అవసరం. ప్రత్యర్థులు రెచ్చగొట్టారని వివాదాలకు దిగితే ఇబ్బందే. గొలుపోటములు ఎలా ఉన్నా ప్రశాంతంగా లేకుంటే చిక్కులు తప్పవు. ప్రత్యర్థులు ఏదైనా రెచ్చగొడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.
గుర్తింపు కార్డు తప్పనిసరి
ఓటు హక్కు ఉన్న వారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాస్కార్డు, నివాస ధృవీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, విద్యార్హతల మెమో కార్డు తీసుకుని వెళ్లే గుర్తింపుతో వెంటనే ఓటు వేయడానికి వీలు ఉంటుంది.
ఓటర్లను తరలించడం నేరం
పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలించడం కూడా ఎన్నికల నియమావళి ప్రకారం నేరమే. పోలింగ్ రోజున దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలపై తరలించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేయడం నేరం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారు స్వచ్ఛందంగానే రావాల్సి ఉంటుంది. వారిని ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. వాటిపై కేసులు కూడా నమోదు చేస్తారు.
మహిళలు, పురుషులకు వేర్వేరు లైన్లు
మహిళలు, పురుష ఓటర్లుకు వేర్వేరుగా ఓటు వేయడానికి లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
నిఘా నేత్రాలుంటాయ్..
ఎన్నికల సమయంలో అభ్యర్థులపై నిఘా ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది నిఘాను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ రోజున ఓటర్లను తరలిం చడం, మద్యం, డబ్బులు పంపిణీ చేయడం తదితర ప్రలోభాలపై నాఘా ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఆధారాలు ఉంటే కేసలు కూడా నమోదు చేస్తారు. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.
అధికారులతో అప్రమత్తం..
ఎన్నికల విధుల్లో ఉండే అధికారులతో అభ్యర్థులు, వారి అనుచరులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో దురుసుగా వ్యవహరించకూడదు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకోవడం వంటి చర్యలు చేయకూడదు. ఇటువంటివి చేస్తే కేసుల్లో చిక్కుకుం టారు. అటువంటి వారిని పోలీసులు బైండోవర్ చేస్తారు. అంతే కాకుండా కేసులు నమోదయ్యి, విచారణలో నేర నిర్థారణ జరిగితే జైలు, జరిమానా తప్పదు.
పార్టీ కండువాలకు అనుమతిలేదు
అభ్యర్థులు పార్టీ, ఎన్నికల గుర్తుల బ్యాడ్జీలు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. కండువాలు, బ్యాడ్జీలతో లోనికి వస్తే ఎన్నికల నియామవళిని అతిక్రమించినట్లు భావించి, అధికారులు చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు పాస్లు జారీ చేస్తారు. ఆ పాస్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది.
200 మీటర్ల దూరంలోనే ప్రచారం
పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేయడానికి వీలులేదు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థి ప్రచారానికి అనుమతి ఉంటుంది. వంద మీటర్ల వరకు ఉండే లక్ష్మణ రేఖ దాటి లోపలికి వస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. రూ.250 జరిమానా కూడా విధించవచ్చు.