ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య | Engineering Student Commits Suicide | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 1 2018 12:10 PM | Updated on Apr 1 2018 12:10 PM

అన్నానగర్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పాళయంకోట కలెక్టరేట్‌ ముందు విద్యార్థి బంధువులు రాస్తారోకో చేశారు. వివరాలు.. శివగంగై జిల్లా కరియూర్‌కి చెందిన బాలమురుగన్‌ కుమారుడు మనోజ్‌ (18). ఇతను నెల్‌లై సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీర్‌ కళాశాలలో బీఈ సివిల్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మనోజ్‌ హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మున్నీర్‌పల్లం పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. 

అనంతరం మనోజ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాళయంకోట ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం మనోజ్‌ బంధువులు, విద్యార్థులు పాళయంకోట ఐకిరవుండులో ఉన్న కలెక్టరేట్‌ ముందు రాస్తారోకో చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. ఈ సమాచారం అందుకున్న పాళయంకోట జాయింట్‌ పోలీసు కమిషనర్‌ విజయకుమార్, పోలీసులు అక్కడికి వచ్చారు. చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.   

Advertisement
 
Advertisement
Advertisement