తిరుమలలో ‘వైకుంఠ వీధి’ నిర్మాణం | Cm chandrababu comments on Tirumala Vykunta veedhi | Sakshi
Sakshi News home page

తిరుమలలో ‘వైకుంఠ వీధి’ నిర్మాణం

Jan 3 2017 12:30 AM | Updated on Aug 20 2018 5:08 PM

తిరుమలలో ‘వైకుంఠ వీధి’ నిర్మాణం - Sakshi

తిరుమలలో ‘వైకుంఠ వీధి’ నిర్మాణం

తిరుమలలో నూతనంగా ‘వైకుంఠ వీధి’ని నిర్మించబోతున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సీఎం చంద్రబాబు వెల్లడి..

సాక్షి, అమరావతి: తిరుమలలో నూతనంగా ‘వైకుంఠ వీధి’ని నిర్మించబోతున్నట్టు సీఎం చంద్రబాబు  వెల్లడించారు. వైకుంఠ వీధికి వెళ్లిన భక్తులకు నిజంగా వైకుంఠంలోకి వెళ్లినట్టు అనుభూతి కలిగేలా ఆ వీధిని తీర్చిదిద్దుబోతున్నట్టు చెప్పారు. కాగా తెల్ల రేషనుకార్డు ఉన్న పేదలకు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శనం కల్పించే దివ్యదర్శనం పథకం ప్రారంభమైంది. సోమవారం ముఖ్యమంత్రి విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఆ పథకాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

88 మంది మాత్రమే హాజరు: విజయవాడ నగర, రూరల్‌ మండలాలకు చెందిన 167 మందిని తొలివిడత యాత్రకు దేవాదాయ శాఖ అధికారులు ఎంపిక చేశారు. వీరందరికీ సోమవారం దుర్గమ్మ దర్శనం అనంతరం నాలుగు బస్సుల్లో తిరుమలకు పంపేందుకు ఏర్పాటు చేశారు. అయితే, యాత్రకు ఎంపిక చేసిన వారిలో 88 మంది భక్తులు మాత్రమే హాజరయ్యారు. వీరిని రెండు బస్సుల్లో సర్దుబాటు చేసి పంపి, మిగిలిన రెండు బస్సులను వెనక్కి పంపారు. నాలుగు రోజుల క్రితం యాత్రకు లాటరీ నిర్వహించి ఎంపికైన వారికి  తెలియజేయడంతో వారు పూర్తి స్థాయిలో ప్రయాణానికి సిద్ధం కాలేదని, అందుకే సగం మంది కూడా హాజరుకాలేదని అధికారులు భావిస్తున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ సిద్ధం: గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్‌ అందుబాటులోకి రానుంది. రూ.128 కోట్లతో ఒకేసారి 500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ పనుల ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. జనవరి 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజులు కొత్త టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement