కాలుష్యాన్ని తరిమేస్తాం | BJP promises to make Delhi first 'Green Capital of the World' | Sakshi
Sakshi News home page

కాలుష్యాన్ని తరిమేస్తాం

Nov 21 2013 11:46 PM | Updated on Mar 29 2019 9:18 PM

నగరంలోని కాలుష్యాన్ని పారద్రోలి పచ్చదనం కలిగిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్ ప్రకటించారు.

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కాలుష్యాన్ని పారద్రోలి పచ్చదనం కలిగిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్ ప్రకటించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్‌తోపాటు ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ, బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను గొప్పస్థానంలో ఉంచాలని బీజేపీ భావిస్తోందని, అది ఢిల్లీతోనే ప్రారంభిస్తామన్నారు. అందుకోసం తీసుకోనున్న చర్యలు ఆయన వివరించారు. బీజేపీ అధికారంలోకి వ చ్చిన వెంటనే ఢిల్లీని పచ్చదనం కలిగిన రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. 2020 వరకు తాగునీరు, గాలి, నదులను శుద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెడతామన్నారు. ప్రతి ఇంటికీ పైన సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమ్యే ఖర్చులో 30 శాతం ఢిల్లీ ప్రభుత్వం, 30 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. 
 
 విద్యుత్ బిల్లుల చెల్లింపునకు బదులుగా ప్రతి ఇంటి నుంచి కొంత కరెంట్‌ను గ్రిడ్‌కి విక్రయించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. 2015వరకు అన్ని ఇళ్లకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పచ్చదనం పెం పొందించడం తదితర పనుల్లో భాగంగా ఢిల్లీలోని 50 వేల మంది యువతీయువకులకు అదనంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజా, ప్రైవేట్ రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హర్షవర్ధన్ వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement