విమాన ప్రయాణికునికి 20 లక్షల పరిహారం | 20 lakh compensation for air travelers | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికునికి 20 లక్షల పరిహారం

Nov 6 2014 3:52 AM | Updated on Sep 2 2017 3:55 PM

ఓ విమాన ప్రయాణికునికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.

చెన్నై: ఓ విమాన ప్రయాణికునికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. 70 ఏళ్ల శివ్‌ప్రకాశ్ గోయెంకా 2010లో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి మాడ్రిడ్ వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టికెట్‌ను కొనుగోలు చేశానని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన టికెట్‌ను ఎకానమీ క్లాస్‌కు ఎయిర్‌లైన్స్ సంస్థ మార్చిందని, 1,500 యూరోల వోచర్ ఇచ్చిందన్నారు.

తాను అనుభవించిన మానసిక క్షోభకు రూ. 95 లక్షలు పరిహా రం చెల్లించాలంటూ గోయెంకా కమిషన్‌ను ఆశ్రయించారు. గోయెంకాకు తాము రెండు సీట్లను ఇచ్చామని, అలాగే తాము ఇచ్చిన వోచర్‌ను కూడా ఆయన తీసుకున్నారని ఎయిర్‌లైన్స్ వాదించింది. విమాన సిబ్బందితో వాదించే ఓపిక లేకపోవడంతో తాను వాటిని తీసుకున్నట్టు గోయెంకా తెలిపారు. గోయెంకా వాదనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. ఆయనకు టికెట్ ధరతో పాటు, రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement