ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తే సస్పెండ్‌ చేస్తా | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తే సస్పెండ్‌ చేస్తా

Published Wed, Jan 24 2018 10:53 AM

dhanunjaya reddy fired on tdp party leaders - Sakshi

శ్రీకాకుళం సిటీ: అధికార యంత్రాంగం ప్రొటోకాల్‌ పాటించకపోతే బాధ్యులను సస్పెండ్‌ చేస్తానని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి స్పష్టం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం ప్రొటోకాల్‌ పాటించడం లేదన్న ఎమ్మెల్యే కళావతి ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ పైవిధంగా స్పందించారు. గ్రామ సర్పంచ్‌ నుంచి మంత్రుల వరకు అధికారులు విధిగా ప్రొటోకాల్‌ను పాటించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయి సంఘ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నాయకులు సైతం పలు శాఖల పనితీరుపై ధ్వజమెత్తారు. అధికారులకు, సభావేదికపై ఉన్న వారికి ప్రశ్నల వర్షం కురిపించారు. వారి సమాధానాలతో అసంతృప్తి వ్యక్తం చేసారు. మొత్తం 47 శాఖల ఉండగా, కేవలం ఏడుశాఖల పనితీరుపై మాత్రమే చర్చ కొనసాగింది. ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 3 వరకు జెడ్పీలో జరిగిన స్థాయి సంఘాల సమావేశం తీరును పరిశీలిస్తే...

చర్చించిన శాఖలు..
ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, హౌసింగ్, మార్కెటింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఎస్‌ఏ శాఖలపై చర్చిం చారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విప్‌ కూన రవికుమార్, కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ చక్రధరబాబు, జెడ్పీ సీఈఓ బి.నగేష్, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే కంబా ల జోగులు, విశ్వాసరాయి కళావతి, గౌతు శ్యాం సుందర్‌శివాజీ, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లు లేకపోతే పింఛన్‌ కట్‌..
మరుగుదొడ్లు నిర్మించకపోతే వ్యక్తిగత పింఛన్, రేషన్‌ సరుకులు నిలుపుదల చేస్తామని కలెక్టర్‌ ధనంజయరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో సర్పంచ్‌లు అశ్రద్ధ చేస్తే 14వ ఆర్థిక సంఘ నిధులు ఆపేస్తామని చెప్పారు. స్వచ్చభారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.18వేలు ఇస్తున్నామన్నారు. 

జిల్లాకు జీవనాడి వంశధార..
వంశధార నది జిల్లాకు జీవనాడి వంటిదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 19 నిర్వాసిత గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించడంలో కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాం గం కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా రూ.12 కోట్లు అదనంగా ఖర్చు పెట్టామన్నారు. నిర్వాసితి కాలనీలకు ప్రత్యేకంగా బృందాలను పంపిస్తూ ఉపాధి జాబ్‌కార్డులను ఇస్తామని చెప్పారు. 

Advertisement
 
Advertisement