కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ | Williamson Rested For Sri Lanka T20 Series Southee Captain | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌కు విశ్రాంతి.. సౌతీకి సారథ్యం

Aug 20 2019 3:55 PM | Updated on Aug 20 2019 3:55 PM

Williamson Rested For Sri Lanka T20 Series Southee Captain - Sakshi

సారథిగా, బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు భారాన్ని మోస్తున్న కేన్‌ విలియమ్సన్‌కు ఎట్టకేలకు కాస్త విశ్రాంతి లభించింది. ఐపీఎల్‌, ప్రపంచకప్‌ అంటూ వరుస మెగా టోర్నీలు ఆడిన విలియమ్సన్‌కు శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం లంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే అతడు స్వదేశానికి బయల్దేరుతాడు. విలియమ్సన్‌తో పాటు, ట్రెంట్‌ బౌల్ట్‌కు కూడా సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. లంకతో సెప్టెంబర్‌ 1 నుంచి జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు టిమ్‌ సౌతీ కివీస్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. 

టీ20 సిరీస్‌ కోసం మంగళవారం 14 మంది సభ్యులతో కూడిన కివీస్‌ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సెలక్టర్‌ లార్సన్‌ మాట్లాడుతూ.. ‘విలియమ్సన్‌కు విశ్రాంతిని ఇవ్వడానికి ఇదే సరైన సమయంగా భావించాం. ప్రపంచకప్‌ నుంచి నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. ఆడటమే కాదు జట్టు బ్యాటింగ్‌ భారాన్ని పూర్తిగా మోస్తున్నాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కివీస్‌ పలు కీలక సిరీస్‌లు ఆడునుంది. దీంతో అతడికి విశ్రాంతినివ్వాలని భావించాం. ఇక వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టును సన్నద్దం చేస్తున్నాం’అని పేర్కొన్నాడు. కాగా,  లంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 0-1తో వెనుకంజలో ఉంది. 

కివీస్‌ టీ20 జట్టు
టిమ్‌ సౌతీ(కెప్టెన్‌), ఆస్టల్‌, టామ్‌ బ్రూస్‌, గ్రాండ్‌హోమ్‌, ఫెర్గుసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, స్కాట్‌ కుగ్లెజన్‌, మిచెల్‌, కోలిన్‌ మున్రో, ర్యాన్సే, సాంట్నర్‌, టిమ్‌ సెఫెర్ట్‌, ఇష్‌ సోధి, రాస్‌ టేలర్‌

Advertisement
 
Advertisement
Advertisement