అందుకోసం ప్రయత్నిస్తా: గంగూలీ | Will Try To Play One Day Night Test Ganguly | Sakshi
Sakshi News home page

అందుకోసం ప్రయత్నిస్తా: గంగూలీ

Nov 4 2019 12:55 PM | Updated on Nov 4 2019 12:56 PM

Will Try To Play One Day Night Test  Ganguly - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు వాతావరణం అంతగా అనుకూలించనప్పటికీ ఆటగాళ్లు ముందుకు రావడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లలోని ఆటగాళ్లు ఎవ్వరూ కూడా వాతావరణం ప్రతీకూలంగా ఉందని చెప్పకపోవడంపై వారికి గంగూలీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అదే సమయంలో డే అండ్‌ నైట్‌ గురించి గంగూలీ మాట్లాడాడు. ప్రతీ ఏడాది తమ షెడ్యూల్‌లో ఒక డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఉండేలా చూడటానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. భారత్‌లోని కాకుండా, విదేశీ పర్యటనలప్పుడు కూడా సదరు బోర్డుతో డే అండ్‌ నైట్‌ టెస్టు ఏర్పాటుకు కృషి చేస్తానన్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరగునన్న మ్యాచ్‌ను డే అండ్‌ నైట్‌ టెస్టుగా నిర్వహించనున్నారు.

విరాట్‌ కోహ్లి విశ్రాంతి తీసుకునే సమయంలో రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పచెప్పడాన్ని గంగూలీ సమర్ధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు సక‍్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రోహిత్‌ శర్మ అనుభవం జాతీయ జట్టుకు పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఉపయోగపడుతుందన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌కు పగ్గాలు అప్పచెప్పవచ్చు కదా అన్న ప్రశ్నకు అందుకు ఇది తగిన సమయం కాదనే అనుకుంటున్నాని తెలిపాడు. అసలు అది చర్చించాల్సిన అవసరం కూడా లేదని గంగూలీ పేర్కొన్నాడు. తాను సెలక్షన్‌ కమిటీ విషయంలో తలదూర్చనన్నాడు.

మరొకవైపు ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా ఘోరంగా వైఫల్యం చెందడంపై కూడా గంగూలీ స్పందించాడు. ప్రతీ జట్టుకు కష్టకాలం అనేది వస్తుందని, వారు త్వరలోనే గాడిలో పడతారన్నాడు. గతంలో పాకిస్తాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు కూడా ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్నాయని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement