‘మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీ’ కుర్రాళ్లంతా స్టార్‌ క్రికెటర్లే! | Will Shubman Gill play for Indias senior side soon  | Sakshi
Sakshi News home page

Feb 5 2018 6:33 PM | Updated on Feb 5 2018 7:16 PM

Will Shubman Gill play for Indias senior side soon  - Sakshi

యువరాజ్‌, పుజారా, శిఖర్‌ ధావన్‌ (ఫైల్‌)

సాక్షి, స్పోర్ట్స్‌ : అండర్‌-19 ప్రపంచకప్‌ భవిష్యత్తు క్రికెటర్లను తీర్చిదిద్దే టోర్నీ.  ఆస్ట్రేలియా వేదికగా 1998లో యూత్‌ వరల్డ్‌కప్‌గా ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్‌ 4 ట్రోఫీలందుకొని ప్రథమ స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ టోర్నీ ద్వారా అనేక మంది కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు సాధించారు. ప్రతిభ కనభర్చిన ప్రతి ఒక్కరికి అవకాశం రాకున్నా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన ప్రతి కుర్రాడు స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు.  గత 18 ఏళ్లుగా ఈ టోర్నీ రికార్డులను పరిశీలిస్తే  ఈ విషయం స్పష్టం అవుతోంది.

2000 సంవత్సరంలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో మహ్మద్‌ కైఫ్‌ కెప్టెన్సీలో భారత్‌ తొలి ప్రపంచకప్‌ సాధించగా యువరాజ్‌ మ్యాన్‌ఆఫ్‌ దిసిరీస్‌ అందుకున్నాడు. అనంతరం యువరాజ్‌ స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. భారత్‌ అందుకున్న టీ20 వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషించగా 2011 ప్రపంచకప్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

2002లో జింబాంబ్వే స్టార్‌ క్రికెటర్‌ టాటెండా టైబు మ్యాన్‌ ఆఫ్‌ దిసిరీస్‌ అందుకున్నాడు. 2004లో ప్రస్తుత టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. 2006లో ప్రస్తుత టీమిండియా నయావాల్‌, టెస్టు స్పెషలిస్టు చతేశ్వరా పుజారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 

2008లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ టిమ్‌ సౌతి, 2010లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిక్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌లందుకున్నారు. 2012లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ విలియమ్‌ బోసిస్టో అందుకోగా 2014లో ప్రస్తుత దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ మార్క్‌రమ్‌ మ్యాన్‌ ఆఫ్‌ టోర్నీగా నిలిచాడు. 2016లో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మెహిదీ హసన్‌ ఈ ఘనతను సోంతం చేసుకున్నాడు. ఇక 2018లో భారత యువకెరటం శుభ్‌మన్‌ గిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డుల నేపథ్యంలో శుభ్‌మన్‌ సైతం త్వరలోనే భారత సీనియర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement