
విండీస్ జట్టు(ఫైల్ ఫొటో)
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కు మరోసారి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది పాకిస్తాన్ లో జరగాల్సిన ఉన్న టీ 20 సిరీస్ ను వాయిదా వేసుకునేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో భద్రతపై విండీస్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అందుకు వాయిదానే సరైన మార్గంగా బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది మూడు టీ 20ల సిరీస్ కు పాక్ కు విండీస్ వెళ్లాల్సి వుంది. అయితే ఎక్కువ మంది విండీస్ ఆటగాళ్లు మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. పాక్ లో భద్రతకు సంబంధించి తీవ్ర అభ్యంతరాన్ని బోర్డు ముందుంచారు. దాంతో ఈ పర్యటనను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవడానికి విండీస్ బోర్డు సిద్ధమైనట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వర్గాల ద్వారా తెలుస్తోంది.
గతేడాది కూడా పాకిస్తాన్ లో పర్యటించడానికి విండీస్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం పాక్ లో జరగాల్సిన విండీస్ మ్యాచ్ లను తటస్థ వేదిక యూఏఈలో జరిపారు. అదే సీన్ ఇప్పడు కూడా రిపీట్ అవుతుండటంతో పాక్ క్రికెట్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.ఇదిలా ఉంచితే, ఇటీవల పాకిస్తాన్ లో వరల్డ్ ఎలెవన్ జట్టు, శ్రీలంక జట్టు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు పాక్ కు రావడంతో తమ తలరాత మారుతుందని పీసీబీ ఆశించినా పరిస్థితిలో మాత్రం పెద్ద మార్పులేదు.