టోక్యోలో భారత్ తొలిపోరు కివీస్తో...
ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదల
టోక్యో: వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. అమ్మాయిల జట్టు నెదర్లాండ్స్ను ఎదుర్కోనున్నారు. ఈ రెండు మ్యాచ్లు జూలై 24నే జరుగుతాయి. 8 సార్లు చాంపియన్ అయిన పురుషుల జట్టు పూల్ ‘ఎ’ తదుపరి పోటీల్లో 25న ఆసీస్, 27న స్పెయిన్, 29న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, 30న చివరి మ్యాచ్లో జపాన్తో ఆడుతుంది. మరోవైపు మహిళల పూల్ ‘ఎ’లో ఉన్న భారత్ 26న జర్మనీ, 28న బ్రిటన్, 29న అర్జెంటీనా, 30న జపాన్లతో తలపడుతుంది. కాగా మెగాఈవెంట్ కోసం అత్యున్నత హంగులతో 42 వేదికలను సిద్ధం చేశామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శుక్రవారం షెడ్యూలును విడుదల చేసింది. ఆరంభ వేడుకలు జూలై 23న జరుగుతాయి. అంతకంటే ముందే అర్చరీ, రోయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ తెలిపింది. 24 నుంచి మిగతా పోటీలు జరుగుతాయి. తొలి మెడల్ ఈవెంట్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో జరుగుతుంది.