ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఆలోచిస్తాం! | think on participation in the World Cup! | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఆలోచిస్తాం!

Oct 22 2015 12:35 AM | Updated on Mar 23 2019 8:48 PM

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణపై ఇంకా సందిగ్ధత వీడకపోవడంతో అసహనానికి గురవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

బీసీసీఐకి పాక్ అల్టిమేటం
 
కరాచీ: భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణపై ఇంకా సందిగ్ధత వీడకపోవడంతో అసహనానికి గురవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు తమ జట్టు టి20 ప్రపంచకప్‌లో పాల్గొనటంపై కూడా పునరాలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ఈ టోర్నీలో తమ క్రికెటర్ల భద్రత అంశాన్ని మళ్లీ సమీక్షించనున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ వెల్లడించారు. ‘మరో వారం పాటు వేచి చూస్తాం. పాక్‌తో సిరీస్ గురించి బీసీసీఐ స్పష్టత ఇచ్చాకే మా నిర్ణయం ప్రకటిస్తాం. ఆ తర్వాతే వచ్చే ఏడాది మేం భారత్‌లో ప్రపంచకప్ ఆడాలా వద్దా అనేది నిర్ణయిస్తాం. మా ఆటగాళ్ల భద్రత కూడా మాకు ముఖ్యం’ అని ఆయన చెప్పారు.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించే విషయంలో బీసీసీఐ నాన్చుడు ధోరణికి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఆల స్యం చేస్తే బీసీసీఐకి ఆసక్తి లేదని భావిస్తామని పీసీబీ పేర్కొంది. ఒప్పందం ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో ఇరు జట్ల మధ్య ఆరు సిరీస్‌లు జరగాలని, ఈ ఏడాది సిరీస్ జరగకపోతే ఈ ఒప్పందానికి అర్థం లేదని షహర్యార్ ఖాన్ అన్నారు. మరో వైపు వచ్చే జనవరిలో కొచ్చిలో జరగనున్న ఆసియా కప్ అంధుల క్రికెట్ టోర్నీనుంచి కూడా పాక్ జట్టు తప్పుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement