‘సెవ్‌కొచ్చి’ యాష్‌ ట్యాగ్‌కు తలొగ్గిన బీసీసీఐ | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 21 2018 4:39 PM

SaveKochi Effect BCCI Shifts India West Indies ODI  - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ‘సెవ్‌కొచ్చి’ యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేసిన ఉద్యమానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి( బీసీసీఐ) దిగొచ్చింది. ఈ మేరకు నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌ వేదికను మారుస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను కొచ్చి నగరానికి కేటాయించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్‌ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు ఫుట్‌బాలర్లు, అభిమానులు కేరళ క్రికెట్‌ సంఘం (కేసీఏ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గతేడాది  అండర్‌–17 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు కూడా జరిగాయి. దీని కోసం స్టేడియంను ‘ఫిఫా’ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించాలంటే మైదానంలో తవ్వకాలు, పెనుమార్పులు తప్పవని కొచ్చి వాసులు ‘సేవ్‌కొచ్చి’ యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌ మీడియా వేదికగా ఉద్యమం చేశారు.

ఈ ఉద్యమానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ చెత్రీలు సైతం మద్దతు పలికారు.  ‘ఫిఫా గుర్తింపు పొందిన కొచ్చి స్టేడియానికి జరగబోయే నష్టం గురించి ఆందోళనగా ఉంది. అటు క్రికెట్, ఇటు ఫుట్‌బాల్‌ రెండింటికీ సమస్య రాకుండా వ్యవహరించాలని కేరళ క్రికెట్‌ సంఘాన్ని కోరుతున్నా. రెండు ఆటల అభిమానులు నిరాశ పడరాదు. దీనిపై వినోద్‌రాయ్‌తో కూడా మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో బీసీసీఐ తమ నిర్ణయాన్నిమార్చుకుంది.

Advertisement
Advertisement