ఇలా అయితే.. ప్రపంచకప్లో ఘోర ఓటమి తప్పదు
కొలంబో : ప్రతిష్టాత్మక ప్రపంచకప్కు కొద్ది నెలల ముందు తమ జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసేల శ్రీలంక మాజీ ఆటగాడు అర్జున రణతుంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లడ్-వేల్స్ వేదికగా మే చివరి వారంలో ప్రారంభ కానున్న ప్రపంచకప్లో శ్రీలంక జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించడం ఖాయమని తేల్చిచెప్పాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అవినీతిలో కూరుకపోయిందని ధ్వజమెత్తాడు. దీంతో ఆటగాళ్లలో నైతికత దెబ్బతిన్నదని.. అందుకే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప దేశం కోసం ఆడటం లేదని విమర్శించాడు. ఇలా అయితే ప్రపంచకప్లో శ్రీలంక తొలి రౌండ్లోనే ఇంటి బాట పట్టడం ఖాయమన్నారు. బోర్డు అధికారులు డబ్బు మీద పెట్టిన దృష్టి ఆటపై గాని ఆటగాళ్లపై గాని పెట్టడంలేదని దుయ్యబట్టారు.
స్వదేశీ విదేశాల్లోనూ లంక వరుసగా సిరీస్లు ఓడిపోయినప్పటికీ.. జట్టులో ఎలాంటి ప్రక్షాళన చేయడం లేదని బోర్డు అధికారులపై మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్పై దృష్టి పెట్టి యువ ఆటగాళ్లలో మరింత నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవడంలో బోర్డు పూర్తిగా విఫలమైందని అన్నాడు. ఇక ఇప్పటికే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించకపోవడంతో శ్రీలంక క్రికెట్ జట్టు ఆట ఎంతకి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలని అన్నాడు. ఇక 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టుకు రణతుంగా సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరగుతున్న టెస్టు సిరీస్లోనూ శ్రీలంక తడబడుతుంది. తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన లంక.. రెండో టెస్టులోనూ ఎదురీదుతోంది.