గాలే వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్ట్లో 10 వికెట్ల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో ఇండియా సొంతం చేసుకుంది. తొలి టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఎ తమ మొదటి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సహాన్ అరాచిగే శతక్కొట్టగా (127).. నువానిదు ఫెర్నాండో 44, అంజల బండారా 42 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 543 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ (267 బంతుల్లో 168; 22 ఫోర్లు) భారీ సెంచరీ చేయగా... దేవదత్ పడిక్కల్ (94) , కెప్టెన్ ధ్రువ్ జురేల్ (88 బంతుల్లో 53; 6 ఫోర్లు), సారాన్ష్ జైన్ (137 బంతుల్లో 70; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీలతో మెరిశారు.
శ్రీలంక బౌలర్లలో కేశర నువాంత నాలుగు, సుదీరా తిలకరత్నే మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది.
మరోసారి గుర్నూర్ బ్రార్ 6 వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో ఆతిథ్య శ్రీలంక భారత్ ముందు కేవలం 33 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఈ లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలో చేధించింది.


