పట్నా పైరేట్స్‌కు షాక్‌  | Pro Kabaddi League 2018, Tamil Thalaivas beat Patna Pirates | Sakshi
Sakshi News home page

పట్నా పైరేట్స్‌కు షాక్‌ 

Oct 8 2018 1:41 AM | Updated on Oct 8 2018 1:41 AM

Pro Kabaddi League 2018, Tamil Thalaivas beat Patna Pirates - Sakshi

చెన్నై: ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. క్షణాల్లో ఆధిపత్యం చేతులు మారే ఈ ఆటలో తొలి మ్యాచ్‌లోనే సంచలన ఫలితం నమోదైంది. అజయ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని తమిళ్‌ తలైవాస్‌ 42–26తో ప్రదీప్‌ నర్వాల్‌ సారథ్యంలోని పట్నా పైరేట్స్‌ను బోల్తా కొట్టించింది.  తమిళ్‌ తలైవాస్‌ కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ 14 పాయింట్లతో సత్తాచాటగా... ట్యాక్లింగ్‌లో అమిత్‌ హుడా రాణించాడు. పట్నా పైరేట్స్‌ తరఫున కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు.  పుణేరీ పల్టన్, యు ముంబాల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 32–32 వద్ద ‘డ్రా’గా ముగిసింది.  రెండు జట్లు ప్రతీ పాయింట్‌కు తీవ్రంగా పోరా డాయి.

 ఫలితంగా పోరు చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పుణేరీ పల్టన్స్‌ తరఫున నితిన్‌ తోమర్‌ 15 రైడ్‌ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో గిరీశ్‌ మారుతి ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ 14 పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో కెప్టెన్, ఇరాన్‌ ప్లేయర్‌ ఫజల్‌ సత్తాచాటాడు. నేడు జరుగనున్న లీగ్‌ మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement