
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్కు యు ముంబా చేతిలో పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన పోరులో యు ముంబా 41–20తో టైటాన్స్పై భారీ విజయాన్ని సాధించింది. ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 19 సార్లు రైడింగ్కు వెళ్లిన దేశాయ్ 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఫజల్ అత్రాచలి 4, సురేందర్, వినోద్, అబొల్ఫజల్ తలా 2 పాయింట్లు చేశారు. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లలో రాహుల్ చౌదరి ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు.
15 సార్లు రైడింగ్కు వెళ్లిన రాహుల్ కేవలం 7 పాయింట్లే తెచ్చాడు. ఫర్హాద్ 4, అనిల్, మోసిన్, అర్మాన్ రెండేసి పాయింట్లు సాధించారు. అనంతరం రెండో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 36–31తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ (12 పాయింట్లు) అదరగొట్టాడు. జస్వీర్ 8, సుఖేశ్ హెగ్డే, మన్జీత్ చిల్లర్ చెరో 4 పాయింట్లు చేశారు. పుణేరి తరఫున నితిన్ తోమర్ (8) ఆకట్టుకున్నాడు. రవికుమార్ 4, మోను 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్తో హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టన్తో యూపీ యోధ తలపడతాయి.