
దుబాయ్: ఇటీవల టీ 20 ర్యాంకింగ్స్ విడుదల చేసే క్రమంలో ముందుగా రాత పూర్వక తప్పిదం జరిగినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. టీ 20 ర్యాంకింగ్స్లో భాగంగా ఐసీసీ అధికారి ప్రతినిధి ఒకరు రాతపూర్వక తప్పిదం చేసినట్లు పేర్కొంది. గతవారం సదరు ఐసీసీ ప్రతినిధి టీ 20 ర్యాంకింగ్స్ గురించి క్రికెట్ డాట్ కామ్ ఏయూకి వివరాలు వెల్లడిస్తూ.. ఇంగ్లండ్, న్యూజిలాండ్తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా చివరి వరకూ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉంటే ఆ జట్టు కొత్తగా వరల్డ్ నంబర్ వన్గా అవతరిస్తుందని ప్రకటించారు. కాగా, ఇక్కడ ఆసీస్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ సాధించినా రెండో స్థానానికే పరిమితమైంది.
అయితే దీనిపై బుధవారం ఐసీసీ వివరణ ఇస్తూ.. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తానే టాప్ ర్యాంకులో ఉన్నట్లు తెలిపింది. ఇక్కడ ఆసీస్ 125.65 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 125.84 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే ఇక్కడ రెండు జట్లు దాదాపు 126 పాయింట్లు సాధించినప్పటికీ 0.19 తేడాతో పాకిస్తాన్ ప్రథమ స్థానంలో నిలిచిందని ఐసీసీ వెబ్సైట్లో వివరణ ఇచ్చింది. అదొక రాత పూర్వక తప్పిదంగా పేర్కొంది.