ఐపీఎల్‌ : నల్ల వస్త్రాలను అనుమతించేది లేదు.! | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ : నల్ల వస్త్రాలను అనుమతించేది లేదు.!

Published Tue, Apr 10 2018 12:50 PM

May Not Permit Visitors With Black shirts in CSKvsKKR IPL Match  - Sakshi

సాక్షి, చెన్నై : కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పలు రాజకీయ, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ మ్యాచ్‌లను నిర్వహిస్తే అడ్డుకోని తమ నిరసనను తెలియజేస్తామని కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య చెపాక్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఇప్పటికే చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహించి తీరుతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆందోళనకారులు నల్లటి వస్త్రాలతో మ్యాచ్‌లకు హాజరై తమ నిరసన తెలియజేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే మ్యాచ్‌ నిర్వాహకులు మాత్రం నల్లటి వస్త్రాలు, రిస్ట్‌ బ్యాండ్స్‌, బ్యాడ్జెస్‌లతో వచ్చే అభిమానులను స్టేడియంలోకి అనుమతించబోమని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. 

అభిమానులు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, హెల్మెట్స్‌, కెమెరాలు, గొడుగులు, బయటి ఫుడ్‌, మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏవస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రతిస్టాండ్‌లో ప్రయివేట్‌ సెక్కూరిటీతో పాటు పోలీసులు ఉంటారని, ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండా చూస్తారన్నారు. ప్రతిస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. దాదాపు 4వేల మంది పోలీసులో ఈ బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement