భారత యువ పేసర్‌ ఖలీల్‌కు మందలింపు | Khaleel Ahmed reprimanded for provocative action | Sakshi
Sakshi News home page

భారత యువ పేసర్‌ ఖలీల్‌కు మందలింపు

Oct 30 2018 3:58 PM | Updated on Oct 30 2018 4:40 PM

Khaleel Ahmed reprimanded for provocative action  - Sakshi

ముంబై:  వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో అతిగా ప్రవర్తించిన టీమిండియా యువ పేసర్ ఖలీల్‌ అహ్మద్‌ను మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ మందలించారు.  మార‍్లోన్‌ శామ్యూల్స్‌ వికెట్‌ తీసిన తర్వాత ఖలీల్‌ దూకుడుగా ప్రవర్తించాడు. వికెట్‌ తీసిన ఆనందంలో శామ్యూల్స్‌పైకి దూసుకెళ్లాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిబంధనలకు వ‍్యతిరేకం కావడంతో ఖలీల్‌ను మ్యాచ్‌ రిఫరీ  హెచ్చరించారు. ఈ క‍్రమంలోనే అతనికి ఒక డిమెరిట్‌ పాయింట్‌ను విధించారు. ఐసీసీ లెవల్‌-1 నిబంధనల్లో భాగంగా ఆర్టికల్‌ 2.5 కోడ్‌ను ఖలీల్‌ ఉల్లఘించాడు. ఈ ఆర్టికల్‌ ప్రకారం ఒక ఆటగాడిని మరొక ఆటగాడు అసభ్యంగా దూషించడం కానీ చర్యల ద్వారా కవ్వించడం కానీ చేయకూడదు. దీన్ని ఖలీల్‌ అతిక్రమించడంతో అతను హెచ్చరికకు గురయ్యాడు.

భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 14 ఓవర్‌ నాల్గోబంతికి శామ్యూల్స్‌ ఔటయ్యాడు. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు స్లిప్‌ క్యాచ్‌ ఇచ్చి శామ్యూల్స్‌ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఖలీల్‌ అతిగా ప‍్రవర్తించినట్లు ఫీల్డ్‌ అంపైర్లు ఇయాన్‌ గౌడ్‌, అనిల్‌ చౌదరిలు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఖలీల్‌కు ఒక డెమెరిట్‌ పాయింట్ విధించిన రిఫరీ.. హెచ్చరికతో సరిపెట్టాడు. తన తప‍్పిదాన్ని ఖలీల్‌ ఒప్పుకోవడంతో దీనిపై ఎటువంటి తదుపరి విచారణ అవసరం లేదని రిఫరీ బ్రాడ్‌ తెలిపారు. విండీస్‌తో నాల్గో వన్డేలో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ వేసిన ఖలీల్‌ అహ్మద్‌ 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 224 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement