రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా | India beat west indies by 26 runs in Womens T20 World cup warm up match | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా

Jun 8 2026 7:38 PM | Updated on Jun 8 2026 8:12 PM

India beat west indies by 26 runs in Womens T20 World cup warm up match

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా బోణీ కొట్టింది. కార్డిఫ్‌ వేదికగా విండీస్‌తో ఇవాళ (జూన్‌ 8) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది.

భారత ఇన్నింగ్స్‌లో భారతి ఫుల్మాలి (56 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించగా..  షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (39), యస్తికా భాటియా (36) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్‌ 7, రిచా ఘోష్‌ డకౌట్‌, రాధా యాదవ్‌ 1, శ్రేయాంక పాటిల్‌ 2, క్రాంతి గౌడ్‌ 4, శ్రీ చరణి 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో అఫీ ఫ్లెచర్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. కరిష్క రామ్హరాక్‌, ఆలియా అలెన్‌, డియాండ్రా డొట్టిన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఓపెనర్లు డొట్టిన్‌ (49), షెర్మైన్‌ క్యాంప్‌బెల్‌ (25) శుభారంభం అందించినా, శ్రేయాంక పాటిల్‌ (4-0-36-4), రాధా యాదవ్‌ (4-0-25-3) చెలరేగడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మినహా విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. భారత్‌ జూన్‌ 10న జరగే తమ మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement