ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 14న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ గాయపడ్డాడు.
17వ ఓవర్ చివరి బంతిని వేయడానికి రన్-అప్ తీసుకుంటున్న సమయంలో అతడి కుడి తొడ కండరాలు పట్టేశాయి. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో ఖలీల్ మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్లోని మిగిలిన బంతిని గుర్జాపనీత్ సింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడిని స్కానింగ్కు తరలించారు.
అయితే వైద్య పరీక్షలలో ఖలీల్ అహ్మద్కు గ్రేడ్ 2 క్వాడ్రిసెప్స్ టియర్ (కండరాల పగుళ్లు) అయినట్లు నిర్ధారణ అయింది. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అతడు మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఖలీల్ స్ధానాన్ని మరో ఫాస్ట్ బౌలర్తో సీఎస్కే భర్తీ చేయనుంది.
ఇప్పటికే ఎంఎస్ ధోని సేవలను కోల్పోయిన సీఎస్కే నిజంగా ఇదొక భారీ షాక్ అనే చెప్పాలి. ఖలీల్ తన పేస్ బౌలింగ్తో పవర్ప్లే స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఖలీల్ ఈ ఏడాది సీజన్లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికి.. తన అద్భుత బౌలింగ్తో పవర్ప్లేలో పరుగులు రాకుండా కట్టడి చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ఖలీల్ను రూ.4.8 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.
చదవండి: గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి


