క్వార్టర్స్‌లో సాకేత్-సనమ్ జోడీ | Ivashka stops Saketh in the opening round | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్-సనమ్ జోడీ

Oct 28 2015 1:56 AM | Updated on Sep 3 2017 11:34 AM

మరో డబుల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఏటీపీ చాలెంజర్ టోర్నీ
పుణే: మరో డబుల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-1, 6-1తో తెముర్ ఇస్మయిలోవ్ (ఉజ్బెకిస్తాన్)-అర్పిత్ శర్మ (భారత్) జంటపై గెలిచింది. అయితే సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.

రెండు గంటల మూడు నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సాకేత్ 7-5, 4-6, 2-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీతో సాకేత్ ఈ సీజన్‌ను ముగిస్తున్నాడు. ఈ ఒక్క నెలలోనే సాకేత్ మూడు టోర్నీల్లో బరిలోకి దిగి ఏకంగా 25 మ్యాచ్‌ల్లో (14 సింగిల్స్, 11 డబుల్స్) పాల్గొన్నాడు.
 
మరోవైపు భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్‌లు సింగిల్స్‌లో రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ 6-4, 7-5తో మాక్సిమ్ జాన్వీర్ (ఫ్రాన్స్)పై, సనమ్ సింగ్ 6-4, 6-1తో అలెజాంద్రో బెగా (ఇటలీ)పై, ప్రశాంత్ 6-4, 6-4తో ఆర్థర్ డీ గ్రీఫ్ (బెల్జియం)పై గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement