
సాక్షి, స్పోర్ట్స్ : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచే భారత అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ఢిల్లీలోని అండర్ 19 ఆటగాడు ఫైనల్లో సెంచరీతో చెలరేగిన మన్జోత్ కర్లా ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. అస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యం చాలా చిన్నదని, ఆటగాళ్లందరూ మంచి ఫాంలో ఉన్నారని, భారత్ గెలుపు ఖాయమని మ్యాచ్ జరుగుతుండగానే మన్జోత్ కర్లా తల్లి రంజిత్ కర్లా జోస్యం చెప్పారు. రంజిత్ కర్లా చెప్పినట్టుగానే భారత కుర్రాళ్లు ఆసిస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నారు. ఫేవరెట్గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో అలవోకగా గెలుపొందింది. ఈ గెలుపుతో అండర్-19 ప్రపంచకప్ను అత్యధిక సార్లు(నాలుగుసార్లు) గెలుపొందిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండు వికెట్లు కోల్పోయి 38.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది.