
ఏంటిది ..?
సొంతగడ్డపై స్పిన్ పిచ్... భారీ స్కోరు చేయకపోయినా, మన స్పిన్నర్ల అండతో మ్యాచ్ను సులభంగా గెలవచ్చని అనుకున్నారు.
సొంతగడ్డపై స్పిన్ పిచ్... భారీ స్కోరు చేయకపోయినా, మన స్పిన్నర్ల అండతో మ్యాచ్ను సులభంగా గెలవచ్చని అనుకున్నారు. బంతిని తిప్పేస్తుంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వణికిపోవాల్సిందే అని భావించారు. కానీ అదంతా రివర్స్ అయింది. కివీస్ బ్యాట్స్మెన్ అనూహ్య ప్రతిఘటనతో మన బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. 47 ఓవర్లు వేసినా ఒక్క వికెట్తోనే సరిపెట్టుకున్నారు. ఆ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో భారత్ను కట్టడి చేస్తే, మనం ఇద్దరు స్పిన్నర్లతో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాం.
తొందరగానే తొలి వికెట్ కోల్పోయినా... విలియమ్సన్, లాథమ్ మన జట్టుకు అవకాశమివ్వలేదు. ప్రతీ బంతిని జాగ్రత్తగా ఆడుతూ పట్టుదలగా పోరాడారు. వీరి శతక భాగస్వామ్యం న్యూజిలాండ్ను రెండో రోజు మెరుగైన స్థితిలో నిలిపింది. వర్షం కారణంగా మూడో సెషన్ పూర్తిగా రద్దు కాగా... దానికి ముందు కొన్నిసార్లు బంతి విపరీతంగా టర్న్ కావడం, మరి కొన్నిసార్లు అనూహ్యంగా పైకి లేవడం పిచ్ మారుతున్నట్లు సంకేతాన్ని ఇచ్చాయి. మూడో రోజు భారత్ దీనిపైనే ఆశలు పెట్టుకుంది.
రోజంతా తీసింది ఒక వికెట్టే
న్యూజిలాండ్ 152/1
లాథమ్, విలియమ్సన్ అర్ధ సెంచరీలు
మ్యాచ్కు వర్షం అడ్డంకి
కాన్పూర్: భారత గడ్డపై స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో న్యూజిలాండ్ మంచి హోంవర్క్ చేసినట్లుంది. పెద్దగా అంచనాలు లేకుండా ఇక్కడ అడుగు పెట్టిన ఆ జట్టు తొలి టెస్టులోనే తమ ముద్ర చూపించింది. ముందుగా బౌలింగ్లో రాణించిన కివీస్... మ్యాచ్ రెండో రోజు బ్యాటింగ్లో ఆకట్టుకుంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్సలో 47 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (115 బంతుల్లో 65 బ్యాటింగ్; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (137 బంతుల్లో 56 బ్యాటింగ్; 5 ఫోర్లు) రెండో వికెట్కు అభేద్యంగా 117 పరుగులు జోడించారు.
సరిగ్గా టీ విరామం సమయంలో భారీగా కురిసిన వర్షంతో మైదానం అంతా చిత్తడిగా మారింది. దాంతో సమీక్ష అనంతరం ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మొత్తంగా రెండో రోజు 54 ఓవర్ల ఆట జరిగింది. కివీస్ ఇదే జోరును మూడో రోజు కొనసాగిస్తే భారత్కు కష్టాలు తప్పవు. అంతకు ముందు భారత్ తమ ఓవర్నైట్ స్కోరుకు 27 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్సలో 318 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ మరో 166 పరుగులు వెనుకబడి ఉంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 318.
న్యూజిలాండ్ తొలిఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 21; లాథమ్ (బ్యాటింగ్) 56; విలియమ్సన్ (బ్యాటింగ్) 65; ఎక్స్ట్రాలు 10; మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 152.
వికెట్ల పతనం: 1-35.
బౌలింగ్: షమీ 8-1-26-0; ఉమేశ్ 7-2-22-1; జడేజా 17-1-47-0; అశ్విన్ 14-1-43-0; విజయ్ 1-0-5-0.
తొలి సెషన్: జడేజా దూకుడు
ఓవర్నైట్ స్కోరు 291/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు ఆడి మరో 27 పరుగులు జోడించింది. సాన్ట్నర్, బౌల్ట్ చెరో మూడు ఓవర్లు వేయగా, జడేజా (44 బంతుల్లో 42 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) 4 ఫోర్లు, సిక్సర్ బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే వాగ్నర్ తన తొలి ఓవర్లోనే ఉమేశ్ (9)ను అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స ముగిసింది. జడేజా, ఉమేశ్ చివరి వికెట్కు 41 పరుగులు జోడించారు.
న్యూజిలాండ్ తమ ఇన్నింగ్సను జాగ్రత్తగా ప్రారంభించింది. స్పిన్పై గట్టిగా నమ్మకం పెట్టుకున్న కోహ్లి మూడో ఓవర్లోనే జడేజాను బౌలింగ్కు దించడం విశేషం. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న గప్టిల్ (21) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా... ఉమేశ్ ఇన్స్వింగర్కు వెనుదిరిగాడు. ఈ దశలో లాథమ్, విలియమ్సన్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని చకచకా పరుగులు సాధించారు.
ఓవర్లు: 7, పరుగులు: 27,
వికెట్లు: 1 (భారత్)
ఓవర్లు: 21, పరుగులు: 71,
వికెట్లు: 1 (న్యూజిలాండ్)
రెండో సెషన్: బౌలర్లు విఫలం
లంచ్ తర్వాత కూడా కివీస్ బ్యాట్స్మెన్ ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆడారు. తరచూ స్వీప్ షాట్లతో స్పిన్ను ఎదుర్కొన్నారు. అశ్విన్, జడేజా ప్రభావం చూపలేకపోగా, రివర్స్ స్వింగ్ అంచనాతో ఉమేశ్కు బంతి అందించినా ప్రయోజనం దక్కలేదు. అరుుతే కివీస్ బ్యాట్స్మెన్ ఈ సెషన్లో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నారు. పలు మార్లు ఎల్బీడబ్ల్యూల కోసం భారత బౌలర్లు గట్టిగా, విశ్వాసంతో చేసిన అప్పీళ్లను అంపైర్లు తిరస్కరించారు. విజయ్ వేసిన ఫుల్టాస్ బంతి నేరుగా లాథమ్ ప్యాడ్లకు తగిలినా... అంపైర్ సంతృప్తి చెందలేదు.
బ్యాట్ ఎడ్జ తీసుకుంటూ కొన్ని బంతులు ఫీల్డర్లకు సమీపంలో పడ్డాయి. జడేజా బౌలింగ్లో విలియమ్సన్ కీపర్కు క్యాచ్ ఇచ్చినట్లు కనిపించినా, బ్యాట్స్మన్కే ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ దక్కింది. మరోసారి అశ్విన్ ఓవర్లో కివీస్ కెప్టెన్ బ్యాట్నుంచి వచ్చిన బంతి హెల్మెట్కు తగిలి స్టంప్లకు తాకినా... అదృష్టవశాత్తూ బెరుుల్స్ పడలేదు. ఈ క్రమంలో ముందుగా లాథమ్ 119 బంతుల్లో, ఆ తర్వాత విలియమ్సన్ 78 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి బ్యాటింగ్తో భారత్ వికెట్ తీయకుండానే సెషన్ను ముగించింది.
ఓవర్లు: 26, పరుగులు: 81, వికెట్లు: 0
ఇలా అయితే అవుట్ కాదా!
రెండో రోజు ఆటలో జరిగిన అనూహ్య ఘటన భారత్కు రెండో వికెట్ దక్కకుండా చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స 37వ ఓవర్... జడేజా వేసిన బంతిని లాథమ్ స్వీప్ చేశాడు. బంతి అతని షూకు తగిలి పైకి లేచింది. షార్ట్ లెగ్లో ఉన్న ఫీల్డర్ రాహుల్ కొంత తడబడ్డా చివరకు అందుకోవడంతో మన ఆటగాళ్లు సంబర పడ్డారు. అయితే సందేహంతో ఫీల్డ్ అంపైర్ దానిని మూడో అంపైర్కు నివేదించాడు. షాట్ తర్వాత బంతికి నేలకు తగల్లేదని నిర్ధారించేందుకే రీప్లే చూస్తున్నారని భారత ఆటగాళ్లు భావించారు.
అయితే అనూహ్యంగా లాథమ్ను నాటౌట్గా ప్రకటించడంతో కోహ్లి సేన నివ్వెరపోయింది. రాహుల్ క్యాచ్ పట్టడం సరైనదే అయినా... ఛాతీపై దూసుకొచ్చిన బంతిని అందుకునే క్రమంలో అతని హెల్మెట్ గ్రిల్ ట్రాప్కు బంతి తగిలింది. నిబంధనల ప్రకారం ‘క్యాచ్ పూర్తయ్యే లోపు ఫీల్డర్ ధరించిన హెల్మెట్ బంతికి అడ్డు రాకూడదు’. దాంతో చేతికి అందిన వికెట్ కూడా భారత్ చేజారడంతో అంతా నిరాశలో మునిగారు.