టీమిండియా క్లీన్‌స్వీప్‌

IND Vs NZ: Clinical India Complete Clean Sweep - Sakshi

మౌంట్‌మాంగనీ: టీమిండియా వదల్లేదు.. న్యూజిలాండ్‌ కథ మారలేదు. భారత్‌ బౌలింగ్‌లో మెరుపులు ఆగలేదు.. కివీస్‌ బ్యాటింగ్‌లో వైఫల్యం గాడిన పడలేదు. టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడలేదు. న్యూజిలాండ్‌ ఒత్తిడిని అధిగమించలేదు. వెరసి చివరి టీ20లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఫలితంగా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌చేసింది. దాంతో కివీస్‌ గడ్డపై తొలిసారి ఒక టీ20 సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్‌ బ్యాటింగ్‌లో సీఫెర్ట్‌(50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాస్‌ టేలర్‌(53; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసినా మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. భారత్‌ నిర్దేశించిన 164 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గప్టిల్‌(2), మున్రో(15), టామ్‌ బ్రూస్‌(0)లు నిరాశపరచగా, ఆ తర్వాతే అసలు సిసలు పోరు మొదలైంది. (ఇక్కడ చదవండి: శివం దూబే చెత్త రికార్డు)

టేలర్‌-సీఫెర్ట్‌ మెరుపులు
కివీస్‌ కష్టాల్లో పడ్డ సమయంలోనే టేలర్‌-సీఫెర్ట్‌లు మెరుపులు మెరిపించారు. భారత్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే 30 బంతుల్లో సీఫెర్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, తన కెరీర్‌లో వందో టీ20 ఆడుతున్న టేలర్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 97 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ప్రధానంగా శివం దూబే వేసిన ఒక ఓవర్‌లో 34 పరుగులు జోడించడంతో కివీస్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది. 10 ఓవర్‌ తొలి రెండు బంతుల్ని సీఫెర్ట్‌ సిక్స్‌లుగా మలచగా, మూడో బంతికి ఫోర్‌, నాల్గో బంతికి సింగిల్‌ తీశాడు. ఇక ఐదో బంతి నో బాల్‌ కాగా, దానికి ఫోర్‌ వచ్చింది. దాంతో ఎక్స్‌ట్రా పరుగు, బంతి కూడా వచ్చింది. దాంతో ఫ్రీ హిట్‌ను సిక్స్‌ కొట్టిన టేలర్‌.. ఆఖరి బంతికి కూడా సిక్స్‌ తో ముగింపు ఇచ్చాడు.(ఇక్కడ చదవండి: శాంసన్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీల్డింగ్‌!)

ఆ తర్వాత సీఫెర్ట్‌ను సైనీ పెవిలియన్‌కు పంపడంతో కివీస్‌ ఒత్తిడిలో పడింది. సీఫెర్ట్‌ అయిన కాసేపటికి  డార్లీ మిచెల్‌ రనౌట్‌ అయ్యాడు. శాంసన్‌, రాహుల్‌ల అద్భుతమైన రనౌట్‌కు డార్లీ మిచెల్‌ వికెట్‌ను చేజార్చుకున్నాడు.ఆపై వరుసగా న్యూజిలాండ్‌ వికెట్లు కోల్పోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.   శార్దూల్‌ వేసిన చివరి ఓవర్‌లో ఇష్‌ సోధీ(16 నాటౌట్‌: 10 బంతుల్లో 2 సిక్స్‌లు) రెండు సిక్సర్లు కొట్టినా విజయాన్ని అందించలేకపోయాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించగా, సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌లు  తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్‌ సుందర్‌కు వికెట్‌ దక్కింది. 

మరోసారి మెరిసిన రాహుల్‌-రోహిత్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(60 రిటైర్డ్‌ హర్ట్‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-సంజూ శాంసన్‌లు ఆరంభించారు. కాగా, సంజూ శాంసన్‌(2) విఫలమయ్యాడు. మరొకసారి వచ్చిన అవకాశాన్ని శాంసన్‌ కోల్పోయాడు. ఈ రోజు కివీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే క్రమంలో కేఎల్‌ రాహుల్‌, శాంసన్‌లు ఓపెనర్లుగా వచ్చారు. అయితే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కాసేపటికే శాంసన్‌ పెవిలియన్‌ చేరాడు. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని అనవసరమైన షాట్‌కు నిష్క్రమించాడు.(ఇక్కడ చదవండి: కోహ్లిని దాటేసిన రాహుల్‌)

న్యూజిలాండ్‌ బౌలర్‌ కుగ్‌లీన్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి శాంసన్‌ ఔటయ్యాడు. కవర్స్‌లోకి షాట్‌  ఆడి సాన్‌ట్నర్‌కు దొరికిపోయాడు. దాంతో 8 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు జత కలిసిన రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 88 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. బెన్నెట్‌ వేసిన 12 ఓవర్‌ మూడో బంతికి పెవిలియన్‌ చేరాడు. షాట్‌ ఆడదామని రాహుల్‌ యత్నించగా అది ఎడ్జ్‌ తీసుకుని సాన్‌ట్నర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రోహిత్‌ శర్మ-అయ్యర్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించారు. రోహిత్‌ శర్మ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, రోహిత్‌ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు. కాలి కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌ చేరాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన దూబే(5) నిరాశపరిచాడు. చివర్లో మనీష్‌ పాండే(11 నాటౌట్‌: 4 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.  న్యూజిలాండ్‌ బౌలర్లలో కుగ్‌లీన​ రెండు వికెట్లు సాధించగా, బెన్నెట్‌కు వికెట్‌ లభించింది.(ఇక్కడ చదవండి: శాంసన్‌ మళ్లీ మిస్‌ చేసుకున్నాడు..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top