సెమీస్‌లో  హైదరాబాద్‌

Hyderabad hunters It went straight into the semi finals - Sakshi

అహ్మదాబాద్‌పై 4–3తో విజయం

అహ్మదాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4–3తో అహ్మదాబాద్‌ స్మాష్‌మాస్టర్స్‌పై విజయం సాధించింది. దీంతో 21 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. మొదట మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బొదిన్‌ ఇసారా–ఇయోమ్‌ హ్యే వోన్‌ జోడీ 15–14, 15–9తో సాత్విక్‌ సాయిరాజ్‌–సిక్కి రెడ్డి జంటపై గెలిచి శుభారంభం చేసింది. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌కు ట్రంప్‌ మ్యాచ్‌ కాగా... ఇందులో డారెన్‌ ల్యూ 15–13, 15–9తో రాహుల్‌ యాదవ్‌ (హైదరాబాద్‌)పై గెలుపొందాడు. రెండో సింగిల్స్‌లో విక్టర్‌ అక్సెల్‌సన్‌ 15–11, 13–15, 15–8తో మార్క్‌ కాల్జౌ (హైదరాబాద్‌)పై నెగ్గడంతో అహ్మదాబాద్‌ ఆధిక్యం 3–1కు చేరింది.

తర్వాత మహిళల సింగిల్స్‌ బరిలో సింధు ఉండటంతో హైదరాబాద్‌ ట్రంప్‌గా ఎంచుకుంది. సింధు 15–14, 12–15, 15–14తో కిర్‌స్టీ గిల్మోర్‌ (అహ్మదాబాద్‌)పై చెమటోడ్చి నెగ్గడంతో స్కోరు 3–3తో సమమైంది. ఇక నిర్ణాయక పురుషల డబుల్స్‌లో బొదిన్‌ ఇసారా–కిమ్‌ సా రంగ్‌ (హైదరాబాద్‌) జోడీ 15–10, 11–15, 15–14తో సాత్విక్‌ –రెగినాల్డ్‌ ద్వయంపై నెగ్గడంతో హైదరాబాద్‌ విజయం ఖాయమైంది.  మరోవైపు ఢిల్లీ డాషర్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదో మ్యాచ్‌లోనూ  ఢిల్లీ 0–6తో పుణే సెవెన్‌ ఏసెస్‌ చేతిలో చిత్తుగా ఓడింది. నేటి మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌తో చెన్నై స్మాషర్స్‌ తలపడుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top