
ఆసీస్.. అతి జాగ్రత్తగా!
మూడో టెస్టు నాల్గో రోజు ఆట చివరి సెషన్లో రెండు వికెట్లు, ఆపై ఐదో రోజు తొలి సెషన్లో మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా అతి జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళుతోంది.
రాంచీ:మూడో టెస్టు నాల్గో రోజు ఆట చివరి సెషన్లో రెండు వికెట్లు, ఆపై ఐదో రోజు తొలి సెషన్లో మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా అతి జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళుతోంది. కచ్చితమైన ఆటతో భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరి రోజు టీ విరామానికి నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆసీస్ ఆటగాళ్లు హ్యాండ్ స్కాంబ్(44 బ్యాటింగ్;115 బంతుల్లో), షాన్ మార్ష్(38 బ్యాటింగ్; 127 బంతుల్లో) లు క్రీజ్ లో నిలబడి భారత్ కు పరీక్షగా నిలిచారు. వీరిద్దరూ కలిసి దాదాపు 40.0 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ తిరిగి పుంజుకుంది.
అంతకుముందు 23/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ స్కోరు 59 పరుగుల వద్ద రెన్ షా(15) ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. దాంతో ఆసీస్ మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(21) అవుటయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 30 ఓవర్ తొలి బంతికి స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా సంధించిన బంతి గింగిరాలు తిరుగుతూ వచ్చి స్మిత్ వికెట్లను ఎగరేసుకుపోయింది. దాంతో ఆసీస్ స్కోరు 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో షాన్ మార్ష్-హ్యాండ్ స్కాంబ్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఆసీస్ కోల్పోయిన నాలుగు వికెట్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ కు వికెట్ దక్కింది.