ఫెడరర్‌ 15వ సారి... | Federers 15th time joining the semifinals | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌ 15వ సారి...

Nov 17 2018 2:38 AM | Updated on Nov 17 2018 2:40 AM

Federers 15th time joining the semifinals - Sakshi

లండన్‌: తొలి లీగ్‌ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయినా... తదుపరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో గెలిచిన టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘లీటన్‌ హెవిట్‌ గ్రూప్‌’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–4, 6–3తో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో 16వసారి పాల్గొంటున్న ఫెడరర్‌ సెమీఫైనల్‌కు చేరడం ఇది 15వసారి కావడం విశేషం. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక రెండేసి విజయాలు సాధించిన ఫెడరర్, అండర్సన్‌ ‘హెవిట్‌ గ్రూప్‌’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత పొందారు.

అయితే మెరుగైన గేమ్‌ల సగటు ఆధారంగా ఫెడరర్‌ గ్రూప్‌ టాపర్‌గా నిలువగా... అండర్సన్‌కు రెండో స్థానం దక్కింది. ఇదే గ్రూప్‌లో ఒక్కో విజయం సాధించిన నిషికోరి (జపాన్‌), డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) లీగ్‌ దశలోనే నిష్క్రమించారు. ‘కుయెర్టన్‌ గ్రూప్‌’ నుంచి నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 7–6 (7/5), 6–3తో జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా)పై గెలిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్‌తో ఫెడరర్‌; అండర్సన్‌తో జొకోవిచ్‌ తలపడతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement