‘స్లెడ్జింగ్‌ చేయలేక నవ్వులపాలయ్యారు’

Dhawan And Rohit reveals funny sledging incidents by Indian players - Sakshi

లండన్‌: గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో వీరిద్దరిపై టీమిండియా భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే వీరిద్దరూ తాజాగా  బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ గౌరవ్‌ కపూర్‌ షోలో సందడి చేశారు. టీమిండియా ఆటగాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, పేసర్‌ దావల్‌ కులకర్ణిలు స్లెడ్జింగ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

‘గతంలో ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా మాథ్యూ వేడ్‌కు కులకర్ణిల మధ్య సరదా ఘటన చోటుచేసుకుంది. లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌తో ఇద్దరూ ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిద్దరి మద్య సంభాషణ చూసి మేము తెగ నవ్వుకున్నాం. ఇక అజింక్యా రహానే బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అతడిని కవ్వింపులకు పాల్పడితే అతను వెంటనే రియాక్ట్‌ అవుతాడు. కానీ అది బయటకు కనపడదు, వినపడదు. ఓ మ్యాచ్‌లో రహానే బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఆసీస్‌ బౌలర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే రియాక్ట్‌ అయిన రహానే ఏదో అన్నాడు. కానీ వారికి వినపడలేదు. వాళ్లు దగ్గరికి వచ్చి ఏంటి? అనగా మళ్లీ ఏదో అన్నాడు. కానీ మళ్లీ వినపడలేదు. చేసేదేమి లేక వాళ్లు వెనక్కి వెల్లిపోయారు. అది చూసి తెగ నవ్వుకున్నాం. రహానే చాలా సున్నితమైన వ్యక్తి. గట్టిగా ఏది చెప్పలేడు. అరవలేడు’  అంటూ ధావన్‌, రోహిత్‌లు తెలిపారు. 

బ్యాటింగ్‌కు దిగేముందు టాయిలెట్‌ అంటాడు 
ఇక శిఖర్‌ ధావనతో తాను ఎదుర్కొనే ఇబ్బందుల గురించి రోహిత్‌ వివరించాడు. ‘మేం బ్యాటింగ్‌కు దిగే ముందు ప్రతిసారీ ధావన్‌ టాయిలెట్‌కు వెళ్లాలంటాడు. నేను మాత్రం ఫీల్డర్లు వెళ్లడానికి ఐదు నిమిషాల ముందే మైదానంలోకి వెళ్లిపోవాలనుకుంటా. తొలి బంతిని ఎదుర్కొనేది నేనే కాబట్టి ధావన్‌ కారణంగా నా అసహనం మరింత పెరుగుతుంది’అంటూ ధావన్‌పై తనకున్న అసహనాన్ని రోహిత్‌ వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న తలపడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top