ఆర్సీబీతో మ్యాచ్‌: రబడ విజృంభణ | Delhi Bowler Rabada keeps RCB to 149 | Sakshi
Sakshi News home page

ఆర్సీబీతో మ్యాచ్‌: రబడ విజృంభణ

Apr 7 2019 5:45 PM | Updated on Apr 7 2019 5:47 PM

Delhi Bowler Rabada keeps RCB to 149 - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 150 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. పార్థివ్‌ పటేల్‌(9) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌లో లామ్‌చెన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత ఏబీ డివిలియర్స్‌(17) కూడా ఔట్‌ కావడంతో ఆర్సీబీ 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 26 పరుగుల వ్యవధిలో స్టోయినిస్‌(15) పెవిలియన్‌ చేరడంతో ఆర్సీబీ మరింత ఇబ్బందుల్లోకి వెళ్లింది.

ఆ తరుణంలో కోహ్లితో కలిసి మొయిన్‌ అలీ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత అలీ(32;18  బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. ఇక అక్షదీప్‌ నాథ్‌ కలిసి మరో 30 పరుగులు జోడించిన తర్వాత కోహ్లి(41;33 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) పెవిలియన్‌ చేరడంతో ఆర్సీబీ 133 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రాణించకపోవడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడ విజృంభించి బౌలింగ్‌ చేశాడు. డివిలియర్స్‌, కోహ్లి, అక్ష్‌దీప్‌ నాథ్‌, పవన్‌ నేగీ వికెట్లను సాధించి ఆర్సీబీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అతనికి జతగా క్రిస్‌ మోరిస్‌ రెండు వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌, లామ్‌చెన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement