బూమ్రా 'టాప్' లేపాడు!
దుబాయ్: అంతర్జాతీయ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జస్ఫ్రిత్ బూమ్రా టాప్ లేపాడు. తాజాగా మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో బూమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. నిన్న విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో తన కెరీర్ అత్యుత్తమ వన్డే ర్యాంకు(3వ స్థానం)సాధించిన బూమ్రా.. టీ 20ల్లో ప్రథమ స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్ కు చెందిన స్పిన్నర్ ఇమాద్ వసీమ్ తన టీ 20 ర్యాంకును కోల్పోయిన క్రమంలో బూమ్రా ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రస్తుతం బూమ్రా 729 రేటింగ్ పాయింట్లతో టీ 20 టాప్ ను దక్కించుకోగా, ఇమాద్ 719 పాయింట్లతో స్థానం దిగజారి రెండో స్థానంలో నిలిచాడు.
ఇక టీ 20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన టాప్ ర్యాంకను నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో తిరిగి టాప్ ర్యాంకును సాధించిన కోహ్లి.. టీ 20ల్లో తన ర్యాంకును కాపాడుకున్నాడు. విరాట్ కోహ్లి 811 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. జట్ల పరంగా టీ 20 ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే భారత జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ న్యూజిలాండ్ తో జరిగే మూడు టీ 20 ల సిరీస్ ను భారత్ గెలిచిన పక్షంలో రెండో ర్యాంకుకు చేరుతుంది.