
తిరువనంతపురం : భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో అనుకొని సంఘటన.. కలకలం రేపింది. తిరవనంతపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ మైదానం వేదికగా మ్యాచ్ జరగుతుండగా.. ప్రేక్షకులపైకి ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అభిమానులంతా లబోదిబోమంటూ మైదానం బయటకు పరుగు తీశారు. తేనెటీగల దాడి నుంచి రక్షించుకోవడం కోసం చొక్కాలు విప్పి మరీ పరుగెత్తారు. ఈ అనుకోని ఘటనతో మ్యాచ్ 15 నిమిషాలపాటు నిలిచిపోయింది.
సరిగ్గా మ్యాచ్ 28వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అవి అసలు మైదానంలోకే రాలేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రమే దాడి చేశాయన్నారు. తేనెటీగల దాడి సమయంలో భారత్-ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో నడుస్తున్నాడని, వాటి బారిన పడకుండా పరుగు తీశాడని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. ఇదో దురృష్టకరమైన ఘటనని, ప్రేక్షకుల కోసం గ్యాలరీలను శుభ్రం చేయించమన్నారు. కానీ కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనతో ప్రేక్షకులను పశ్చిమ దిశ గ్యాలరీ నుంచి తూర్పుదిశకు మార్చమన్నారు.