
పోరాడుతున్న బంగ్లా
శ్రీలంక జట్టు భారీ స్కోరుకు సమాధానంగా బంగ్లాదేశ్ తీవ్రంగా పోరాడుతోంది. ఓపెనర్ షంషూర్ రెహమాన్ (191 బంతుల్లో 106; 11 ఫోర్లు; 1 సిక్స్), ఇమ్రుల్ కయేస్ (218 బంతుల్లో 115; 17 ఫోర్లు; 1 సిక్స్) కీలక సెంచరీలతో జట్టు ఫాలో ఆన్ను తప్పించుకుంది.
చిట్టగాంగ్: శ్రీలంక జట్టు భారీ స్కోరుకు సమాధానంగా బంగ్లాదేశ్ తీవ్రంగా పోరాడుతోంది. ఓపెనర్ షంషూర్ రెహమాన్ (191 బంతుల్లో 106; 11 ఫోర్లు; 1 సిక్స్), ఇమ్రుల్ కయేస్ (218 బంతుల్లో 115; 17 ఫోర్లు; 1 సిక్స్) కీలక సెంచరీలతో జట్టు ఫాలో ఆన్ను తప్పించుకుంది. వీరి ఆటతీరు ఫలితంగా చివరిదైన రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరు కన్నా ఇంకా 178 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో రెండు వికెట్లున్నాయి. షకీబ్ అల్ హసన్ (89 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు.
పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాను రెహమాన్, కయేస్ అద్భుతంగా ఆదుకున్నారు. లంక బౌలర్లను నిలకడగా ఎదుర్కొన్న వీరు రెండో వికెట్కు ఏకంగా 232 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ వికెట్కు ఇది బంగ్లా తరఫున అత్యుత్తమ భాగస్వామ్యం. క్రీజులో ప్రస్తుతం మహ్ముదుల్లా (54 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు), అల్ అమీన్ (3) ఉన్నారు. మెండిస్కు నాలుగు, పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి.