శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుంది | ban on Sreesanth will continue | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుంది

Oct 18 2017 12:11 AM | Updated on Oct 18 2017 3:01 AM

 ban on Sreesanth will continue

కొచ్చి: స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన నిషేధం కొనసాగుతుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2013–ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో నిందితుడైన 34 ఏళ్ల శ్రీశాంత్‌ బోర్డు నిషేధాన్ని కోర్టులో సవాలు చేశాడు. ఆగస్టు 7న సింగిల్‌ జడ్జి బెంచ్‌ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై బీసీసీఐ హైకోర్టుకు వెళ్లింది. మంగళవారం ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌ సింగ్, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి, నిషేధాన్ని కొనసాగిస్తూ బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతనిపై క్రిమినల్‌ కేసుల్ని దిగువ కోర్టు తోసిపుచ్చినప్పటికీ దాని ప్రభావం తాము విధించిన నిషేధంపై ఉండదని బీసీసీఐ వాదించింది. ఫిక్సింగ్‌పై గట్టి ఆధారాలు లభించడంతోనే బోర్డు మధ్యంతర కమిటీ శ్రీశాంత్‌పై నిషేధం విధించిందని కోర్టుకు తెలిపింది.

బోర్డుపై శ్రీశాంత్‌ నిప్పులు
కొచ్చి: బీసీసీఐకి అనుకూలంగా తీర్పు రావడంపై శ్రీశాంత్‌ ఆక్రోశం వెళ్లగక్కాడు. ట్విట్టర్‌ వేదికగా బోర్డుపై నిప్పులు చెరిగాడు. ‘నిషేధం ఓ చెత్త నిర్ణయం. నా కోసమే అన్నట్లుగా ఉంది ఈ నిబంధన. మరి అసలు దోషుల సంగతేంటి? చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌లపై నిషేధం విధించరా? లోధా నివేదికలోని 13 మంది నిందితులపై ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదా?’ అని ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా తన న్యాయపోరాటం కొనసాగుతుందని చెప్పాడు. మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కేరళ క్రికెట్‌ సంఘం కార్యదర్శి జయేశ్‌ మాట్లాడుతూ శ్రీశాంత్‌కు అండగా నిలవాలనుకున్నప్పటికీ కోర్టు తీర్పే శిరోధార్యమని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement