ఆసీస్‌కు మళ్లీ ఇన్నింగ్స్‌ విజయం 

Another Innings Victory For The Aussies - Sakshi

అడిలైడ్‌: ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా పరిపూర్ణ పాయింట్లు (120) సాధించింది. ఆఖరి టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఆఫ్‌స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ (5/69) తన స్పిన్‌ మాయాజాలంతో పాకిస్తాన్‌ను తిప్పేశాడు. దీంతో ఒకరోజు ముందుగానే మ్యాచ్‌ ముగిసింది. ఫాలోఆన్‌లో 39/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ షాన్‌ మసూద్‌ (68; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అసద్‌ షఫీక్‌ (57; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. వీరు ఆడినంతసేపు బాగానే ఉన్నా... లయన్‌ వాళ్లిద్దర్నీ పెవిలియన్‌ చేర్చడంతో ఇన్నింగ్స్‌ ఇక ఎంతోసేపు సాగలేదు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్, సిరీస్‌’ అవార్డులు వార్నర్‌కే దక్కాయి.

ఆసీస్‌ గడ్డపై పాక్‌ చెత్త రికార్డు... 
1999 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన పాకిస్తాన్‌ ఒక్క  మ్యాచ్‌ అయినా గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య ఈ ఇరవై ఏళ్లలో ఆసీస్‌ గడ్డపై 14 టెస్టులు జరిగాయి. ఆ పద్నాలుగూ పాక్‌ ఓడింది. కనీసం ‘డ్రా’ అయినా చేసుకోలేకపోవడం గమనార్హం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top