ఎఫ్‌బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్ | kashmir Teenager daring stunt after seeing in social media | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్

Jan 26 2018 4:05 PM | Updated on Apr 7 2019 4:36 PM

kashmir Teenager daring stunt after seeing in social media - Sakshi

ప్రమాదకర స్టంట్ చేస్తున్న ఆదిల్

సాక్షి, శ్రీనగర్: రైలు వస్తుండగానే దాని ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకోవాలన్న యత్నంలో ఇప్పటికే కొందరు వ్యక్తులు మృతిచెందారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతూ కాళ్లు, చేతులు కోల్పోతుంటారు. అయితే తాజాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్‌పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ యువకుడి చర్యలను పిచ్చి చేష్టలుగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇలాంటివి చేయకూడదంటూ యువతను హెచ్చరించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కశ్మీర్‌లోని బిజ్బెహ్రా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అదిల్ అహ్మద్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అదిల్ ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ ప్రమాదకర వీడియో చూశాడు. తాను కూడా అలాగే చేయాలని ప్లాన్ చేసుకున్న అదిల్ తన స్నేహితుడు మొహమ్మద్ ఖాసీం(19)తో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. తాను పట్టాలపై పడుకుంటానని, ఆ సమయంలో ట్రాక్‌పై రైలు వెళ్తుండగా వీడియో తీయాలని ఖాసీంకు సూచించాడు. రైలు వెళ్తుండగా పట్టాలపై అదిల్ ధైర్యంగా పడుకోవడం, రైలు వెళ్లిపోయాక తనకు ఏమీ కాలేదంటూ గంతులేయడాన్ని ఖాసీం వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దంటూ పోలీసులు యువతను హెచ్చరించారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్న అదిల్.. మరోసారి తాను ఇలాంటి పనులు చేయనని, ఎవరూ ఇలాంటి ప్రమాదకర స్టంట్లకు ఉపక్రమించవద్దని సూచించాడు.

Advertisement
 
Advertisement
Advertisement