అడ్మిన్‌లు జర పైలం !

Be Alert And Conscious Social Media Admins  - Sakshi

షేర్లు.. లైకుల కోసం ఇష్టమొచ్చింది పోస్టు చేస్తామంటే.. ఎన్నికల వేళ నడువదు! అత్యుత్సాహభరిత పోస్టులు పెట్టి బరిలో ఉన్న అభ్యర్థులపై అవాకులు చెవాకులు పేల్చితే.. ఊచలు లెక్కించాల్సిందే! జరిమానాలు కట్టాల్సిందే! ‘నా గ్రూప్‌లో నేను షేర్‌ చేస్తే ఏమౌతుందిలే’ అన్న నిర్లక్ష్యం అసలే వద్దు.. ఒకవేళ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు!అందుకే.. ఉన్నతాధికారులు సైతం ‘మేమన్నీ చూస్తున్నాం..’ అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేసే వారికి సుతిమెత్తని హెచ్చరికలూ జారీ చేస్తున్నారు. కాబట్టి, అడ్మిన్లూ.. జర పైలం మరే!

గత ఎన్నికల్లో..
సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు ఈమధ్య చాలానే వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సోషల్‌ మీడియాలో వివాదాస్పద పెట్టడంతో, ప్రత్యర్థులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు సంఘటనలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితోపాటు పార్టీలకు సంబంధం లేని వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది.

చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రూపుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరైననా సైబర్‌ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోకొల్లలు. ఇలాంటి చర్యలపై చట్టలు సైతం కఠినంగా ఉన్నాయి.

అంతేకాకుండా.. అశ్లీల సమాచారం, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేస్తే ఇన్ఫర్మేమేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌–2000 ప్రకారం సెక్షన్‌ 67 కింద జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అదే నేరం రెండోసారి పాల్పడినట్లు గుర్తిస్తే పదేళ్ల జైలుపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పోస్టులు పెట్టే అడ్మిన్‌లతోపాటు వాటిని షేర్‌ చేసే వారిని కూడా ఒక్కోసారి బాధ్యులను చేసే అవకాశముంది.

అడ్మిన్‌ బాధ్యతలు..

  • సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూప్‌లకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
  • గ్రూప్‌లో ఉండే ప్రతీ సభ్యుడు కచ్చితంగా అడ్మిన్‌కు తెలిసి ఉండేలా చూసుకోవాలి. అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోవద్దు.
  • ఎవరైనా గ్రూప్‌ సభ్యులు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వివాదస్పద పోస్టులు, కామెంట్లు చేసినా.. ఆ సభ్యుడిని వెంటనే తన గ్రూప్‌ నుంచి తొలగించడం ఉత్తమం.
  • అడ్మిన్‌తోపాటు గ్రూప్‌లోని సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారని తెలుసుకోవాలి.

ఇవి పెట్టొద్దు.. షేర్‌ చేయొద్దు..

  • విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు
  • తప్పుడు సమాచారం, తెలియని అంశాలు
  • మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు
  • ఓ వర్గాన్ని బాధించే కార్టూన్సు 
Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top