ఇది ఒకప్పటి బీజేపీ కానే కాదు | Yashwant Sinha again criticize BJP | Sakshi
Sakshi News home page

Jan 11 2018 1:10 PM | Updated on Aug 16 2018 4:01 PM

Yashwant Sinha again criticize BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం పార్టీలో నేతలకు క్రమశిక్షణ కొరవడి అస్తవ్యస్తంగా తయారయ్యిందన్నారు. ఈ క్రమంలో ఆయన పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయి, అద్వానీల హయాంలో పార్టీ పరిస్థితి ఎంతో బాగుండేదని సిన్హా పేర్కొన్నారు. 

‘‘అప్పట్లో ముఖ్యనేతలను కలిసేందుకు పార్టీ కార్యకర్తలకు కూడా అవకాశం లభించేంది. అందుకు అపాయింట్‌మెంట్‌ కూడా అవసర ఉండేది కాదు. నేరుగా వెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడున్న నేతల వ్యవహారం మరోలా ఉంది. 13 నెలల క్రితం ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు దరఖాస్తు చేసుకున్నా. కానీ, దానికి ఇప్పటిదాకా బదులు లేదు.  అందుకే ఇకపై ఎవరినీ కలవకూడదని నిర్ణయించుకున్నా. చెప్పాలనుకున్న విషయాలను నేరుగా ప్రజలకే వివరిస్తా’’ అని సిన్హా వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం అద్వానీ లాంటి సీనియర్లకు కనీసం గౌరవం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. గత కొంతకాలంగా బీజేపీ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఐ నీడ్‌ టూ స్పీక్‌ అప్‌ నౌ పేరిట ఓ జాతీయ పత్రికలో ఆయన రాసిన వ్యాసంతో మొదలైన ఈ వ్యవహారం.. మహారాష్ట్రలో రైతులకు మద్దతుగా ఆయన చేస్తున్న దీక్షతో తారాస్థాయికి చేరుకుంది. త్వరలో ఆయన మధ్యప్రదేశ్‌ రైతులకు మద్దతుగా దీక్షకు సిద్ధమవుతున్నారు.

నా ఇంటిని అందుకే కూల్చారేమో : శతృఘ్న సిన్హా 

మరో సీనియర్‌ నేత, పట్న ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా పార్టీపై తన అసంతృప్తిని వెల్లగక్కారు. రెండు రోజుల క్రితం శత్రుఘ్న సిన్హాకు చెందిన రామాయణ భవనంలోని కొంత భాగాన్ని బీఎంసీ అధికారులు కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే వాటిని కూల్చేశామని అధికారులు వెల్లడించారు. దీనికి పై శతృఘ్నసిన్హా ట్విట్టర్‌ లో స్పందించారు.

‘‘నా ఇంటిని కూల్చేసిన విషయం ఇప్పుడు వార్తల్లో బాగా చక్కర్లు కొడుతోంది. నిజాయితీగా ఉండటం, నిజాలు మాట్లాడటం... అన్నింటికి మించి యశ్వంత్‌ సిన్హాకు మద్ధతు ఇవ్వటంతోనే మీపై కుట్ర పన్నారా? అని ప్రజలు నన్ను అడుగుతున్నారు. కానీ, నా దగ్గర సమాధానం లేదు’’ అంటూ పరోక్షంగా ఆయన బీజేపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement