కేసీఆర్‌ పాలనలో విద్యారంగం నిర్వీర్యం | Weak education in KCR rule | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనలో విద్యారంగం నిర్వీర్యం

Jun 6 2018 12:05 PM | Updated on Jul 28 2022 7:22 PM

Weak education in KCR rule - Sakshi

 మాట్లాడుతున్న పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు 

కామారెడ్డి అర్బన్‌ : కేసీఆర్‌ గందరగోళ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని, విద్యారంగం దేశంలో 26వ స్థానానికి దిగజారిందని, అంతర్‌ జిల్లాల బదీలీలు, ప్రమోషన్లు లేకుండా వెబ్‌ కౌన్సిలింగ్‌ సాధారణ బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో అయోమాయం నెలకొందని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి అన్నారు.

కామారెడ్డి పీఆర్‌టీయూ భవన్‌లో మంగళవారం మధ్యా హ్నం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో రెగ్యులర్‌ అధికారులు లేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు  లేక ఇన్‌చార్జిలతో అస్తవ్యస్తంగా ఉందన్నారు.

ప్రమోషన్లు చేపట్టిన తర్వాతనే ఈనెల 30 వరకు బదిలీల ప్రక్రియ చేయాలన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరగా సీపీఎస్‌పై నిర్ణయం తీసుకొకుంటే మళ్లీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత రూల్స్‌ సాంకేతిక సమస్యలతో నిలిచిపోందని అతి తొందరలోనే సాధిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు పి.దామోదర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు జె.మధుసూధన్‌రెడ్డి, పురుషోత్తం శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, నర్సింగరావు, సెట్యా, రాష్ట్ర కార్యదర్శులు సంతోష్‌కుమార్, రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు జి.గోవర్థన్, కార్యదర్శి శ్రీకాంత్, కామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట మండలాల అధ్యక్షులు సురేష్,హన్మాండ్లు, నర్సారెడ్డి, మనోహర్, భూమయ్యలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement