భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో ఎమ్మెల్యే పంపించిన డ్యూయల్ డెస్క్ లపై కూర్చున్న విద్యార్థులు
రూ.4 కోట్లతో డ్యూయల్ డెస్క్ ల తయారీ
సొంత డబ్బులు వెచ్చిస్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తన నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి సరైన బెంచీలు లేకపోవడంతో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కేవీఆర్) సొంత డబ్బులతో డ్యూయల్ డెస్క్ లు తయారు చేయించి ఇస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు కలిపి 6 వేల డ్యూయల్ డెస్క్ లు అవసరం అవుతాయని గుర్తించిన ఎమ్మెల్యే, తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ‘కేపీ రాజారెడ్డి జనసేవా ట్రస్ట్’ఆధ్వర్యంలో రూ.4 కోట్ల సొంత డబ్బులతో డ్యూయల్ డెస్క్లు తయారు చేయిస్తున్నారు.
తొలి విడతలో పదిరోజుల్లో 76 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2,800 డ్యూయల్ డెస్క్లు అందించారు. చాలా చోట్ల విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేకపోవడం బాధ కలిగించిందని, అందుకే సొంత డబ్బులతో సౌకర్యాలు కల్పిస్తున్నానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు.


