బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చే ప్రతిపాదన ఉంది
ఈ విషయంలో అధినేతదే తుది నిర్ణయం
మంచిర్యాలలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వచ్చే ఏడాది ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, గత ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చిన చాలా చోట్ల గెలిచామన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఇంట్లో మీడియాతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కవిత పార్టీ ఏర్పాటుపై స్పందిస్తూ.. ఏ ఇంట్లోనైనా కన్నవారిని ఎవరూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించకూడదని, ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో పార్టీ పెడితే నిలబడదని పేర్కొన్నారు. పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతోందని బీఆర్ఎస్కు ఉద్యమంలో, అధికారంలో, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా..
బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ప్రతిపాదన ఉందని, తుది నిర్ణయం అధినేతదే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తెలిపారు. జిల్లాల ఏర్పాటులో ఎక్కడైనా ప్రజా సౌకర్యాల మేరకు స్థానిక మార్పులు చేస్తే అంగీకరిస్తామని, అయితే జిల్లాలను ఎత్తివేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో లోపాలు జరిగాయని, ఉత్తర తెలంగాణలో ప్రవాసులు అధికంగా ఉండే జిల్లాల్లో గల్ఫ్ పాలసీ తీసుకురాకపోవడంతోపాటు, స్థానిక నాయకులను కలుపుకోకపోవడం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పనిచేయడం వంటి లోపాలు జరిగాయన్నారు.
తెలంగాణ బొగ్గుగని కాcక సంఘాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది ఓ భ్రమ మాత్రమేనని.. 40 ఏళ్లలో ఎంతమంది జైలుకు వెళ్లి సీఎంలు అయ్యారని ప్రశ్నించారు. ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్, జీవన్రెడ్డి లాంటి సీనియర్ల చేరిక పార్టీకి మరింత బలాన్నిస్తుందని తెలిపారు. పార్టీలో ఆధిపత్య పోరు లేదని, అధ్యక్షుడు ఎలాంటి వర్క్ ఇస్తే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ వర్క్ చేస్తానన్నారు. తాను ఆల్రౌండర్ను అని, వయసుకు మించి బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.


