సంగారెడ్డి: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో చోటుచేసుకుంది. భారత్ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోని సంగమేశ్, మల్లమ్మ శ్రీజ, దొడ్డి అమోస్కు గాయాలు అయినట్లు తెలిపారు.
గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఇంట్లో దాదాపు 10 డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ సిలిండర్లు ఉన్నట్లు తెలిపారు. ఇంట్లో అన్ని గ్యాస్ సిలిండర్లను ఎందుకు నిల్వ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత వస్తుందన్న వదంతులతో ఇటీవల చాలా మంది అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. కొందరు అక్రమంగా గ్యాస్ సిలిండర్లను అమ్ముకుంటున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే, సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో భారత్ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లోనే గ్యాస్ సిలిండర్లు పేలాయి. గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నప్పటికీ అతడి ఇంట్లో అన్ని సిలిండర్లను ఎందుకు నిల్వ చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి ఉంది.


