ఆఖరి మజిలీకి ఆమె చేయూత! | The role of women in the final assembly | Sakshi
Sakshi News home page

ఆఖరి మజిలీకి ఆమె చేయూత!

Apr 3 2026 4:08 AM | Updated on Apr 3 2026 4:08 AM

The role of women in the final assembly

చావులకు వెళ్లాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కొందరైతే చావుకు వెళ్లినా అంత దూరాన ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తుంటారు. అలాంటిది కొందరు మహిళలు వారసత్వంగా వచ్చిన పాడె కట్టడం, చితి పేర్చడం, బొంద తవ్వడం వంటి వృత్తులు నిర్వహిçస్తూ, ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అలాంటి పనులు మగవారే చేస్తుంటారు. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలే అన్నీ తామై పాడె కట్టడం నుంచి చితిని పేర్చి శవం కాలి బూడిదయ్యేదాకా అన్నీ తామై వారసత్వంగా వస్తున్న ఆ వృత్తిలో ఆఖరి మజిలీ వరకు చేయూతనిస్తున్నారు. 

కామారెడ్డి పట్టణంలో ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందగానే అంత్యక్రియలకు అవసరమైన కుండతో పాటు పాడె కట్టడానికి అవసరమైన కట్టెలు తీసుకుని వెళతారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి డప్పుల చప్పుడు మధ్యన పాడె కడతారు.  శవాన్ని పాడె మీద పడుకోబెట్టగానే బట్ట కప్పేసి శవం పడిపోకుండా తాడుతో కట్టేస్తారు. మరో బృందం చితికి అవసరమైన కట్టెలు తీసుకువచ్చి శ్మశానవాటికలో పేర్చి, శవాన్ని చితిపై పడుకోబెట్టగానే కట్టెలతో నింపేస్తారు. కుటుంబ సభ్యులు చితికి నిప్పంటించగానే, దహనమయేదాకా అక్కడే ఉంటారు. కొన్ని కుటుంబాల వాళ్లు శవాలను ఖననం చేస్తుంటారు. అలాంటి పనుల్లో శవాన్ని ఖననం చేయడానికి గుంత తవ్విన తరువాత శవాన్ని అందులో పూడ్చేసే కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉంటారు. కామారెడ్డి పట్టణానికి చెందిన వారంతా పట్టణంతో పాటు దేవునిపల్లి, క్యాసంపల్లి, సరంపల్లి గ్రామాల్లో చనిపోయిన వారి ఆఖరి మజిలీలో తమ పాత్ర పోషిస్తున్నారు. 

కరోనా అప్పుడు కూడా పనిచేసినం
నేను నలభై ఏండ్ల సంది పాడె కడుతున్న. ఎవరు చనిపోయినా వచ్చి మాట్లాడుకుని వెళతారు. చావుకు అవసరమైన కుండ, పాడె కట్టెలు కొనుక్కుని వెళతాం. ఇంటిముందర కుండలో అన్నం వండి ఇవ్వడం నుంచి పాడె కట్టడం, శవాన్ని పాడెమీద పడుకోబెట్టి తీసుకువెళ్లేదాకా అన్ని పనులు చూసుకుంటాం. ఇంటి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని జీవనం సాగిస్తుంటాం. అయితే మేము చేసేది పుణ్యకార్యంగానే భావిస్తాం. కరోనా సావులు కూడా చేసినం.
– బైరం సిద్దవ్వ

ఇరవై ఏండ్ల సంది చేస్తున్న...
నేను ఇరవై ఏండ్ల సంది వృత్తిలో ఉన్న. మా కుటుంబ వారసత్వంగా వచ్చిన దానిని అలాగే కొనసాగిస్తున్నం. పెద్ద ఊరు కావడం వల్ల ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు సావులు కూడా చేయాల్సి ఉంటది. ఆ రోజు తినడానికి కూడా టైం సరిపోదు. అన్ని సావుల కాడికి వెళ్లాలి. పాడె కట్టాలి. జీవితం ఉన్నన్ని రోజులు చేయాల్సిందే. ఇబ్బందే అయినా బతకుదెరువుకు చేయాల్సిందే. 
– బైరం హేమలత

– సేపూరి వేణుగోపాలచారి, 
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement