
యాదాద్రికి బయలుదేరిన జనచైతన్య రథం
సాక్షి, హైదరాబాద్ : జనచైతన్య యాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం జనచైతన్య యాత్ర ప్రారంభం సందర్భంగా బషీర్బాగ్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, కుటుంబ పాలనకు శుభం పలుకుతామని అన్నారు. అనంతరం జనచైతన్య రథం యాదాద్రికి బయలుదేరింది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారాయన. ఈ సభలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఎన్వీఎస్సెస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రాం చందర్ ఇతర పార్టీ నాయకులు పాల్గొంటారు.