బీసీల ఆశా దీపం నువ్వేనన్నా..

Vaddera and BC union leaders Support to YS Jagan Padayatra - Sakshi

వారికి బాసటగా నిలిచేది వైఎస్‌ కుటుంబమే 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు వడ్డెర, బీసీ సంఘాల నేతల సంఘీభావం

వైఎస్సార్‌సీపీలో చేరిన విశ్రాంత డీఐజీ ఏసురత్నం 

పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతల చేరికలు  

నేడు విజయనగరం జిల్లాలోకి పాదయాత్ర  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘బీసీల అభ్యున్నతి గురించి ఆలోచించేది వైఎస్సార్‌ కుటుంబమే.. అందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాం.. జగనన్న అధికారంలోకి రాగానే బీసీలకు మేలు చేసే మరిన్ని పథకాలు అమలు చేస్తారని నమ్ముతున్నాం’ అని పలువురు బీసీ నేతలు చెప్పారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఈ సందర్భంగా
వారు గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 268వ రోజు ఆదివారం విశాఖ జిల్లాలోని గండిగుండం, అక్కిరెడ్డిపాలెం, జుట్టాడ క్రాస్, పాత్రుళ్లు నగర్, రాయవరపువానిపాలెం, సరిపాలెం గ్రామాల్లో సాగింది. వడ్డెర కుల నేతలతో సహా పలువురు బీసీ నేతలు పాదయాత్రకు మద్దతు తెలపడంతో పాటు వైఎస్సార్‌సీపీలో చేరారు. పలు వర్గాల ప్రజలు తమ కష్టాలను జగన్‌కు మొరపెట్టుకున్నారు. పలువురు వినతులు, ఫిర్యాదులు అందజేశారు. 
 
ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నా..  
తమ ఇళ్లు కాలిపోయినా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని, ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఇల్లు మంజూరు చేయడం లేదని బొడ్డవానిపాలేనికి చెందిన పూడి అచ్చియమ్మ వైఎస్‌ జగన్‌ ఎదుట మొరపెట్టుకుంది. ఇళ్లు నిర్మించుకున్నా తమకు బిల్లులు మంజూరు చేయడం లేదని గండిగుండం కాలనీవాసులు గొరపల్లి పద్మావతి, గండ్రెడ్డి అచ్చియ్యమ్మ, గంట్ల లక్ష్మి, గంట్ల ఈశ్వరమ్మ, గండ్రెడ్డి వరలక్ష్మి తదితరులు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో 250 మందికి ఇళ్ల స్థలాలిచ్చిన పాలకులు.. వైఎస్సార్‌సీసీ అభిమానినన్న కారణంతో తనకు ఇవ్వలేదని జుత్తాడకు చెందిన మేరీకుమారి వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయింది. తనకు వస్తున్న పింఛన్‌ను తెలుగుదేశం వాళ్లు తీసేశారని సబ్బవరానికి చెందిన తాటిపాము ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇలా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ కష్టాలను జననేత వద్ద ఏకరవు పెట్టారు. వారి కష్టాలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు.  
 
అడుగడుగునా పండుగ వాతావరణం  
పాదయాత్ర సాగిన గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. జననేత తమ గ్రామాలకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు జగన్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. మా సమస్యలు తెలుసుకునేందుకు రాజన్న బిడ్డ కాలినడకన మా మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు చెప్పారు. రాయవరపువానిపాలెం వీధుల్లోంచి జగన్‌ వెళుతున్నపుడు ఆ ప్రాంతమంతా జన సంద్రమైంది.  
 
నేడు 3,000 కిలోమీటర్లు అధిగమించనున్న పాదయాత్ర 
వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను విశాఖ జిల్లాలో ముగించుకుని సోమవారం విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తారు. కొత్తవలస సమీపంలోని దేశపాత్రునిపాలెంలో ప్రజా సంకల్ప యాత్ర 3,000 కిలోమీటర్లను అధిగమించనుంది.  

వైఎస్సార్‌సీపీలోకి విశ్రాంత డీఐజీ ఏసురత్నం  
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌ 
గుంటూరు జిల్లాకు చెందిన విశ్రాంత డీఐజీ చంద్రగిరి ఏసురత్నం తన అనుచరులతో కలిసి ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం సమీపంలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు, వందలాది మంది ముఖ్య అనుచరులు పార్టీలో చేరారు. ఏసురత్నంతో పాటు ఆయన అనుచరులకు వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ బీసీ సామాజికవర్గంలో పుట్టి ఉన్నత స్థానానికి ఎదిగిన ఏసురత్నం రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఆయనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఏసురత్నం సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు.  
 
జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం 
ఈ సందర్భంగా చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ డీఐజీ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ పాదయాత్రగా మూడు వేల కిలోమీటర్లు అధిగమించడం గొప్ప విషయమన్నారు. ప్రపంచ చరిత్రలో ఎవరూ ఇంతవరకు ఇలాంటి పాదయాత్ర చేయలేదన్నారు. మాట తప్పని కుటుంబం నుంచి వచ్చిన జగన్‌.. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పారు. ఆయన ప్రకటించిన నవరత్నాలే జగన్‌ను అధికార పీఠంపై కూర్చోబెడతాయన్నారు. వైఎస్సార్‌కు వడ్డెర కులస్తుడైన వెంకటప్పడు విద్య నేర్పించడంతో దానికి కృతజ్ఞతగా వెంకటప్పడు పేరున పాఠశాల స్థాపించారని, ఆ పాఠశాలను ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ కొనసాగించడం అభినందనీయమన్నారు. పార్టీలో చేరిన వారిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్, గుంటూరు మాజీ ఎంపీపీ బత్తుల రామస్వామి, వడ్డెర సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఈశ్వర్, ఏపీ బీసీ సంక్షేమ సంఘ పొలిట్‌బ్యూరో సభ్యురాలు చంద్రగిరి కరుణకుమారి, ఏపీ వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బండారు బ్రహ్మయ్య, తెలుగు రాష్ట్రాల వడ్డెర సంఘ అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు తురకా కిషోర్, మాచర్ల వడ్డెర సంఘం మాజీ అధ్యక్షుడు బత్తుల రాజాతో పాటు వందలాది మంది ఏసురత్నం అనుచరులున్నారు. 

చదవండి: రావాలి జగన్‌.. కావాలి జగన్‌..
జననేత వెంట జనప్రవాహం
పాలకుల కుట్రలపై జనం కన్నెర్ర
రాజకీయ ప్రభంజనం

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top