కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు: కుంతియా

TRS Leaders into Congress says Kuntia - Sakshi

సాక్షి, కామారెడ్డి: టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పెద్ద నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, శనివారం నుంచి వలసలు ఉంటాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా వెల్లడించారు. శుక్రవారం కామారెడ్డిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఓ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా పార్టీలో చేరుతారని చెప్పారు. మహాకూటమిలో సీట్ల గురించి చర్చలు జరుగుతున్నాయని, శుక్రవారం కూడా చర్చలు సానుకూలంగా జరిగాయని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

తమ పార్టీలో టికెట్‌ల కోసం తీవ్ర పోటీ ఉందన్నారు. అయినప్పటికీ పొత్తులో భాగంగా ఎవరికెన్ని సీట్లు అన్నదాని ప్రకారంగా స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారని, వారు టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులను వంచించాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం ప్రశ్నించే పరిస్థితి లేకుండా నియంత పాలన సాగించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top