కుంతియా వద్ద ఖమ్మం కాంగ్రెస్‌ పంచాయితీ! | TPCC observer Kuntiya to look after Khammam Congress group war | Sakshi
Sakshi News home page

కుంతియా వద్ద ఖమ్మం కాంగ్రెస్‌ పంచాయితీ!

Dec 5 2017 4:19 AM | Updated on Dec 5 2017 4:19 AM

సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా వద్ద పంచాయితీ జరిగినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికకోసం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా రాష్ట్ర నేతలు ఢిల్లీ వచ్చారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కుంతియాతో సుమారు గంటన్నర సమావేశమై చర్చించినట్టు సమాచారం.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ పదవుల్లో తమకు అయిన వారినే నియమించుకుంటున్నారని, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ టికెట్ల కోసం పార్టీలోకి వస్తున్న కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ముఖ్యమైన అంశాలపై స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారని సమాచారం. ఈ సందర్భంగా నేతలు పరస్పరం వాదనలకు దిగినట్టు తెలిసింది. వర్గపోరు విడిచి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కుంతియా హితవు పలికారు.  పార్టీ పటిష్టతకుగాను అందరూ కలసి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించగా, దీనికి రేణుకా చౌదరి, భట్టి, సుధాకర్‌రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement